![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra Pradesh News: ఎన్నికల తరువాత చంద్రబాబు, జగన్, పవన్ ఏం చేస్తున్నారంటే?
Telugu News: ఎన్నికల ప్రచారాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, బుజ్జగింపులు, బ్రతిమాలడాలు, బెదిరింపులు, ఉరుకులు పరుగులతో అలసిపోయిన నేతలు రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు.
![Andhra Pradesh News: ఎన్నికల తరువాత చంద్రబాబు, జగన్, పవన్ ఏం చేస్తున్నారంటే? AP Political Leaders Went To Holiday Mode jagan in Europe trip Andhra Pradesh News: ఎన్నికల తరువాత చంద్రబాబు, జగన్, పవన్ ఏం చేస్తున్నారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/5b2e51e56e82a72fe5a15cca28b8f6381716001955207798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Election 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. గత కొద్ది నెలలుగా ఉన్న రాజకీయ వేడి పోలింగ్ ముగియడంతో చల్లారిపోయింది. అక్కడక్కడా ఉద్రిక్తల మినహా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంది. ఎన్నికల ప్రచారాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, బుజ్జగింపులు, బతిమాలడాలు, బెదిరింపులు, ఉరుకులు పరుగులతో అలసిపోయిన నేతలు రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. నెలల తరబడి ఎండలను లెక్కచేయకుండా గెలుపుకోసం తిరిగిన అభ్యర్థులు హాలిడే ట్రిప్పులకు వెళ్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండడంతో జాలీగా ట్రిప్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే టెన్షన్ నుంచి ఉపశమనం కోసం నేతలు పొలిటికల్ హాలిడే ట్రిప్పులు వేస్తున్నారు.
రెండు వారాల వరకు ప్లాన్లు
రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ఆగాల్సిందే. దీంతో నేతలు రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్లు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించిన నేతలు.. ఫలితాలు వచ్చేలోపు కాస్త సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే కొందరు విదేశాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. మరికొందరేమో స్వదేశంలోనే పర్యాటక ప్రాంతాలు, ఇంకొందరు పుణ్య క్షేత్రాలు పర్యటిస్తున్నారు. కనీసం 10 నుంచి 15 రోజుల వరకు హాలిడే ట్రిప్పులు ప్లాన్లు వేస్తు్న్నారు. ఈ సమయంలో ఎవరిని కలవడానికి ఆసక్తి చూపించడం లేదు.
లండన్ పర్యటనకు సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపిన జగన్ కుటుంబంతో సరదాగా గడిపేందుకు లండన్ వెళ్లారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్, భారతి లండన్ బయల్దేరారు. కౌంటింగ్కి చాలా సమయం ఉండడంతో జగన్ తన కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. మొదట లండన్ వెళ్లి అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు వెళ్లే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ వరకూ జగన్ ఫ్యామిటీ యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల కౌంటింగ్కి మూడు రోజుల ముందు సీఎం జగన్ ఏపీకి తిరిగి వస్తారు. ఇప్పటికే సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఫారిన్ టూర్కి వెళ్తున్నారు. గత ఎన్నికల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకి వెళ్లారు.
పుణ్యక్షేత్రాలను చుట్టేస్తున్న చంద్రబాబు
ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పుణ్య క్షేత్రాలు సందర్శిస్తున్నారు. పోలింగ్ జరిగిన వెంటనే ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు షిర్డీ, కొల్హాపురి క్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తరువాత తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు శ్రీశైలం, అన్నవరం, పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు.
అమెరికాకు చంద్రబాబు
నేటి నుంచి చంద్రబాబు అమెరికా పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు.
రెస్ట్ మోడ్లోకి పవన్ కల్యాణ్
ఎన్నికల ప్రచారం అయిపోయిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన తన ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న సినిమా షూటింగ్ల గురించి పలువురు నిర్మాతలతో చర్చిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తీవ్రంగా అలసిపోయిన పవన్ జ్వరం బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన నేపథ్యంలో పవన్ ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం.
మిగతా లీడర్లలో చాలా మంది విదేశాలకు చెక్కేశారు. ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఈ 15 రోజులు ఎంజాయ్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)