Nara Lokesh Meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ, జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు.. చర్చించిన అంశాలివే
Andhra Pradesh News | ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ, జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు.. చర్చించిన అంశాలివే

Nara Lokesh Delhi Tour | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్య, పరిశ్రమలశాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ, నారా లోకేష్ చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. ఈ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చిన అనుమతి రాష్ట్రానికి కలిసొస్తుందన్నారు. ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ నుంచి కీలక మద్దతు, సహకారం లభించినట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.
మంత్రి లోకేష్ ఈ భేటీ సమయంలో ప్రధాని మోదీకి యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని అందించారు. పుస్తకం యోగాంధ్ర ప్రాంతం, అక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ రూపొందించారు. అలాగే, విద్యారంగంలో వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, విద్యావేత్తలు లాభపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాక, మంత్రి లోకేష్ తన భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ప్రగతి గురించి ప్రధానికి వివరించారు. ఇటీవల జరిగిన సింగపూర్ బృందం పర్యటన వివరాలను కూడా ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి మరిన్ని ఆర్థిక అవకాశాలు, పరిశ్రమల స్థాపన అవకాశాలు మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేపట్టిన చర్యలు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి.
నాలుగు నెలల్లోనే రెండోసారి మోదీతో భేటీ
దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు మే 17న తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి నారా లోకేష్ మోదీని కలిశారు. అనంతరం 4 నెలల వ్యవధిలోనే నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని కలిశారు. పలువురు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ వరుస భేటీలు కానున్నాయి.
నారా లోకేష్కు ఢిల్లీలో ఘన స్వాగతం..
రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల విషయమై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి @naralokesh గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం పలికారు. గురువారం రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు… pic.twitter.com/hG11yMSgQL
— Vemireddy Prabhakar Reddy (@vpr_official_) September 5, 2025
గత నెలలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ
గత నెలలో ఢిల్లీలో పర్యటించిన నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, గ్రీన్ఫీల్డ్ హైవేలు, కుప్పం- బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరారు. ఇప్పుడు ప్రధాని మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలపై చర్చించి మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏపీలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.






















