![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP HighCourt : విశాఖకు కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఉండదు - హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
Visakhapatnam Capital : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించబోమని ఏపీ హైకోర్టుకు ప్రభుత్వ లాయర్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని న్యాయమూర్తి తెలిపారు.
![AP HighCourt : విశాఖకు కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఉండదు - హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం AP government lawyer told the AP High Court that the government offices will not be shifted to Visakhapatnam AP HighCourt : విశాఖకు కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఉండదు - హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/11/40f1aa43834c6c704f8fe9617f56f5cf1702298544250228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
government offices will not be shifted to Visakhapatnam : విశాఖకు కార్యాలయాలను హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ తరలించబోమని ఏపీ ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు. క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి రాజధాని తరలింపు పిటిషన్పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో దీనిపై మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు.
రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు. ఈ లోపు ప్రభుత్వం కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తుందని, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోరారు. కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇలానే చెప్పి కార్యాలయాలు తరలించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.... కార్యాలయాల తరలింపు ఉండదని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు తీసుకోవాలని అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. అనంతరం కేసు విచారణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో క్యాంప్ కార్యాలయాల పేరు చెప్పి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రయత్నాలు జరుగతున్నాయని హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 22న జారీ చేసిన జీవో 2283ను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావుతో పాటూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక సీఎస్ ఎస్ఎస్ రావత్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మిని వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు జీఏడీ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విశాఖ కలెక్టర్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, రుషికొండ టూరిజం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ తదితరులను ప్రతివాదులుగా ఉన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ముందుకు వచ్చిన సమయంలో ఫోరం షాపింగ్ అని..ఆరోపణలు ప్రభుత్వ లాయర్ చేశారు.దీనిపై హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోస్టర్ ప్రకారమే తమ ముందుకు వచ్చిందని కావాలంటే.. మధ్యంతర పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)