AP Budget 2026-27 :రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
AP Budget 2026-27: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ డిప్యూటీ సీఎఎం పవన్ కల్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి సాధ్యమైందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Andhra Pradesh Budget Highlights: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్ లో సంక్షేమం, మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు, వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు
ఒకసారి ఒటాన్ అకౌంట్ బడ్జెట్... రెండు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి
రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా.
రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లగా అంచనా.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం... 11.75 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు
2025-26వ ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాం అన్నారు పయ్యావుల కేశవ్.
2025-26 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోందన్నారు
2025-26వ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని...ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశం శక్తిమంతంగా ఉందనే గుర్తింపును అంతర్జాతీయ స్థాయిలో సాధించడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని చెప్పాలన్నారు పయ్యావుల కేశవ్. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రాజీ పడదని మోదీ గట్టి సంకేతాలు ఇచ్చారని బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక కార్యాకలాపాల పునరుద్దరణ చర్యలను బడ్జెట్లో ప్రస్తావించారు. స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను బడ్జెట్లో పొందుపరిచారు. ఈ తరహా అంశాలను బడ్జెట్టులో ప్రస్తావించడం ఇదే తొలిసారి అని గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియచేయడం కోసమే వివరాలను బడ్జెట్టులో ప్రస్తావించామన్నారు ఆర్థిక మంత్రి.
గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించమని వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపామని చెప్పారు పయ్యావుల. 12.3 శాతంగా ఉన్న వడ్డీని 9 శాతానికి తగ్గించేలా ఆయా ఆర్థిక సంస్థలను ఒప్పించామని తెలిపారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిపామన్నారు. సంప్రదింపుల ఫలితంగా ఏడాదికి రూ. 327 కోట్ల మేర ఆదా అయిందని..మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు ఆర్థికమంత్రి. ఈ సంప్రదింపులు ఫలిస్తే ఏడాదికి రూ. 1658 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల్లో రూ. 24,811 కోట్లు చెల్లింపులు జరిపామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.






















