AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Vizag Suryalanka Beach Bars GO: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీచ్ షాక్స్ బార్ లైసెన్స్ పాలసీ తీసుకు వచ్చింది. వైజాగ్, సూర్యలంక తీరంలో తాత్కాలిక బార్లకు అనుమతి ఇస్తారు. లైసెన్స్ ఫీజు, నిబంధనలను జీవోలో పొందు పరిచారు.

Eco Friendly Beach Shacks Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టూరిజం రూపురేఖలను మార్చేందుకు సరికొత్త అడుగులు వేస్తోంది. గోవా సంస్కృతిని తలపించేలా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొస్తూ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం.. ప్రాథమికంగా బాపట్లలోని సూర్యలంక, విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాల్లో ఈ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేయబోతోంది.
పైలట్ ప్రాజెక్ట్గా వైజాగ్, సూర్యలంక.. గ్రీన్ కట్టడాలకే చాన్స్!
రాష్ట్రంలో తీరప్రాంత పర్యాటకాన్ని లాభసాటిగా మార్చడం , స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏపీ సచివాలయం ఈ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా తొలి దశలో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో 2, విశాఖపట్నం తీరంలో 2 బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, కేవలం పర్యావరణ అనుకూల తాత్కాలిక సామగ్రితో మాత్రమే వీటిని నిర్మించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంక్రీట్ కట్టడాలు చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.
స్థలం పరిమితి.. కఠినమైన అనుమతులు తప్పనిసరి!
బీచ్లలో ఇష్టారాజ్యంగా షాక్స్ నిర్మించకుండా ప్రభుత్వం స్థలం పరిమితిని కూడా విధించింది. ఒక్కో బీచ్ షాక్ కనీసం 1,000 నుండి గరిష్టంగా 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా, సముద్ర తీర నిబంధనల ప్రకారం అత్యంత కీలకమైన సిఆర్ జెడ్ క్లియరెన్స్తో పాటు లోకల్ ట్రేడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రత అనుమతి, ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందడం ఈ షాక్స్ నిర్వహణకు తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేశారు.
కేవలం లైట్ లిక్కర్ మాత్రమే.. టైమింగ్స్ ఇవే!
బీచ్ పరిసరాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మద్యం విక్రయాలపై ప్రభుత్వం పక్కా ఆంక్షలు పెట్టింది. ఈ బీచ్ షాక్స్లో సాధారణ IMFL - ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ , నాటు సారా లేదా ఇతర ఘాటైన విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు, అంటే.. బీర్, వైన్ , రెడీ-టు-డ్రింక్ పానీయాలు మాత్రమే ఇక్కడ విక్రయించాలి. అలాగే, మద్యం సరఫరా సమయాన్ని కూడా పరిమితం చేస్తూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
భారీ లైసెన్స్ ఫీజు.. మూడేళ్ల కాలపరిమితి!
ఈ ప్రీమియం బీచ్ షాక్ బార్ లైసెన్స్ వార్షిక రుసుమును ప్రభుత్వం భారీగానే ఖరారు చేసింది. ఏడాదికి 75 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ ఫీజు ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ లైసెన్సులు మొత్తం మూడేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో బీచ్ టూరిజం బ్రాండింగ్ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోవా తరహా టూరిజం.. సరికొత్త అనుభూతి!
ఇప్పటివరకు గోవా, పాండిచ్చేరి లాంటి ప్రాంతాలకే పరిమితమైన బీచ్ లైఫ్ అనుభూతిని.. ఇకపై మన ఏపీ తీరంలోనే పర్యాటకులు ఆస్వాదించవచ్చు. పచ్చని తాత్కాలిక షెడ్లు, సముద్రపు గాలుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు గడిపేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో నెల్లూరు మైపాడు, కాకినాడ ఎన్టీఆర్ బీచ్, ప్రకాశం జిల్లా రామాపురం లాంటి మరికొన్ని ప్రముఖ తీర ప్రాంతాలకు కూడా ఈ బీచ్ షాక్స్ విధానాన్ని విస్తరించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















