PM Modi Review Polavaram Project: తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించనున్న ప్రధాని మోదీ, ఈ 28న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
PM Modi Review Polavaram Project: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలతో మే 28న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

Polavaram Project Latest News updates: అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం ద్వారా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు.
మే 28వ తేదీన మధ్యాహం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఒడిశా సీఎం లతో పాటు ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె.విజయానందకు తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం పాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించడం తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని నీతి ఆయోగ్ గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
ఇంకా భూ సేకరణ చేయాలి
ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ జరగాలంటే 15,227 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని సమాచారం. ఒకవేళ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393 ఎకరాలు భూమి సేకరించాలి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడదానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సమీక్షలో దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే బ్యాక్ బ్యాటర్ లో తెలంగాణలో ముంపు పెరిగిపోతుంది. నీటి వినియోగం లాంటి అంశాలపై సైతం పలు రాష్ట్రాల సీఎంలు, సంబంధిత అధికారులతో కలిసి ప్రధాని మోదీ సమీక్షిస్తారు.
2014-19 మధ్య కాలంలో ఎన్డీయే కూటమిగా ఉన్న ఏపీ ప్రభుత్వం పోలవరం పనులు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడూ ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో 72 శాతం వరకు పూర్తి చేయించారు. దయాఫ్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తిచేశారు. దానిపై ఎర్త్ కమ్ రాక్ఫెల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం వేసేస్తే, ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయిపోయేవని అధికారులు తెలిపారు. కానీ తరువాత ఏపీలో ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయని.. వైసీపీ హయాంలో జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ప్రభుత్వం మారడంతో నెమ్మదించిన ప్రాజెక్టు పనులు
కేంద్రం వద్దని చెప్పినా గత ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థను మార్చేసింది. ఫలితంగా 2020లో గోదావరికి వరద ఉదృతి పెరగడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీంతో ప్రధాన డ్యాం పనులు నిలిచిపోయాయి. తరువాత ఏడాది పాటు పనులు జరగలేదు. గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ పోలరవం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచన మేరకు కొత్త డయాఫ్రం వాల్, సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేయనున్నారు. 2027 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.






















