Somu Veerraju: మళ్లీ 3 రాజధానులా? అసలు జీతాలకు డబ్బులున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి: సోము వీర్రాజు
రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారని.. ఆ మాట ఆయన అన్నారో లేదో వైసీపీ నాయకులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు కోరారు.

ఏపీలో మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే ఏపీ ప్రభుత్వం ఈ పని చేస్తోందని సోము వీర్రాజు విమర్శించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదని కొట్టిపారేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారని.. ఆ మాట ఆయన అన్నారో లేదో వైసీపీ నాయకులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. అంతరాత్మ సాక్షిగా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. శాసన సభను అబద్ధాలు, బండబూతులు, వ్యక్తిగత జీవితాలు మాట్లాడేందుకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు మీరేం చేశారో చెప్పండి..
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు చోట్ల రాజధానులు పెట్టేందుకు అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని.. అలాంటప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఈ విషయంలో ప్రజల్ని మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారని, తికమక పెడుతున్నారని అన్నారు. రాయలసీమ నుంచి ఎంతో మంది సీఎంలుగా పనిచేసినా అక్కడి అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని సోము వీర్రాజు అన్నారు. నగరంలో హైకోర్టు పెడితే రాజధాని అయిపోతుందా? అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధిపై జగన్కు ఉద్దేశం ఉంటే హంద్రీ-నీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం గుంటూరుకు ఎయిమ్స్, తిరుపతిలో ఐఐఎం.. కర్నూలు, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో పెట్రో కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టులు ఇచ్చిందని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాష్ట్రానికి అసలు మీరేం చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని వీర్రాజు ప్రశ్నించారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా మహిళా ఉద్యోగి రాజీనామా.. 2024లో మళ్లీ సీఎం అయ్యాకే..!
సోము వీర్రాజు నిర్ణయమే.. మా నిర్ణయం: కిషన్ రెడ్డి
మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నిర్ణయమే తమ నిర్ణయం, పార్టీ నిర్ణయం కూడా అని అన్నారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో విశాఖలో పర్యాటక అభివృద్ధి చెందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని ప్రాజెక్టులను ఈ రోజు పరిశీలిస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Prakasam: చంద్రబాబును అవమానించారని కానిస్టేబుల్ రాజీనామా
Addressing Press Conference at @BJP4Andhra HQ, Vijayawada https://t.co/RRFBxSnv9v
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) November 23, 2021
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ట్రెండింగ్ వార్తలు






















