అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నింటికీ అమరావతి అంటే మా ఉత్తరాంధ్ర వాళ్లు ఏం చేయాలంటూ ప్రశ్నించారు. అమరావతిని శాశ్వత రాజధాని అని చెప్పడంపై మండిపడ్డారు.

రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ మరోసారి చర్చకు తెరతీసింది. ఆ పార్టీలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పులు తెచ్చి రాజధానిని అభివృద్ధి చేస్తున్నరన్నారని మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అమరావతిని శాశ్వత రాజధాని అంటూ తీర్మానం చేయడంపైనా అభ్యంతరం తెలిపారు.
శాశ్వత రాజధానంట.. మమ్మల్ని తరిమేస్తారంట..
అమరావతిని శాశ్వత రాజధాని అని తీర్మానం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 65 ఏళ్ల పాట హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే.. అక్కడ నుంచి తరిమేస్తే.. ఇక్కడకు వచ్చిపడ్డామని.. రేపు అమరావతి వాళ్లు కూడా మమ్నల్ని తరిమేస్తే మేం ఎక్కడకు వెళ్లాలన్నారు. "శాశ్వత రాజధాని అనే విధానం రాజ్యాంగంలో లేదని.. ఇప్పుడు శాశ్వత రాజధాని అని తీర్మానం చేస్తే.. రేపు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదా..?" అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి రాజధానిలో పెడుతున్నారని.. కనీసం వెయ్యికోట్లు శ్రీకాకుళానికి ఇచ్చారా అని ప్రశ్నించారు.
జగన్ను చూసి నేర్చుకోవాలి..
ధర్మాన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చాలా సెటైర్లు వేశారు. చిన్నవాడైనా జగన్ పరిపాలనను చూసి నేర్చుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేశారని.. ఆ స్ఫూర్తి చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోర్టులు, ప్రాజెక్టలు ఇచ్చారని ఇప్పుడు వాటిని పూర్తి చేయడం లేదన్నారు.
రాజధాని విషయంలో వైసీపీకి నో క్లారిటీ
రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్పీపీ తీవ్ర గందరగోళంలో ఉంది. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసిన తీర్మానంపై అవునని కాదని చెప్పలేని అయోమయంలో పడింది. ఇవాళ శ్రీకాకుళంలో జరిగిన చలో మూలపేట కార్యక్రమంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు దానినే ధృవీకరిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు అమరావతిపై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం ఎందకూ పనికిరాదని కామెంట్ చేశారు.
మూలపేట పోర్టుకోసం పోరాటం
వైఎస్సార్సీపీ ఇవాళ 'చలో మూలపేట' పోర్టు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పోర్టును జగన్ మోహనరెడ్డి అన్ని అనుమతులు తెచ్చి.. నిధులు కేటాయిస్తే..కూటమి ప్రభుత్వం తామే శాంక్షన్ చేశామని చెప్పుకోవడాన్ని తప్పు పడతూ వైసీపీ కార్యక్రమం నిర్వహించింది. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని దానిని త్వరగా పూర్తిచేయాలంటూ చలో మూలపేట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే పోర్టు వద్దకు వెళ్లడానికి అనుమతి నిరాకరించడంతో గ్రామం వద్ద వైసీపీ సభ నిర్వహించింది.























