AP BharatNet Project: ఏపీలో భారత్ నెట్ కోసం కేంద్రంతో ఒప్పందం.. గ్రామాలకు ఇంటర్నెట్తో డిజిటల్ సర్వీసులు
BharatNet Project in Andhra Pradesh | ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓసీ ఇది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవానికి బాటలు వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ఇళ్లకు హై-స్పీడ్ ఫైబర్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ (Amended BharatNet Project) అమలు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 2,432 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భారత్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) పేరుతో ఒక ప్రత్యేక విభాగం (SPV)ని కూడా ఏర్పాటు చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. డిజిటల్ భారత్ నిధి, ఏపీ ప్రభుత్వం పరస్పర సహకారంతో ఈ నిధులను వెచ్చించి ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాయి. రైట్ ఆఫ్ వే (RoW) అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్రస్థాయి సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.
సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు సహకార ఒప్పందం కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది గ్రామీణ… pic.twitter.com/c1AiJ6McgU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 22, 2026
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,426 గ్రామ పంచాయతీలలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో భాగంగా మొదటి దశలోని 1,692 పంచాయతీల నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయడంతో పాటు, రెండో దశలోని 11,254 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేస్తారు. అలాగే కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కూడా కనెక్షన్లు ఇస్తారు. ఈ డిజిటల్ కనెక్టివిటీ ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఈ-గవర్నెన్స్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలు మారుమూల గ్రామాలకు సైతం వేగంగా అందుబాటులోకి రానున్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
డిజిటల్ విప్లవం, మెరుగైన జీవన ప్రమాణాలు
ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ గ్యాప్ చాలా మేరకు తగ్గుతుంది. విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఆన్లైన్ విద్యా వనరులు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్య రంగంలో టెలిమెడిసిన్ సేవలు మెరుగుపడతాయి. దీనివల్ల మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా పట్టణాల్లోని నిపుణులైన వైద్యుల సలహాలను వీడియో కాల్స్ ద్వారా పొందవచ్చు. అలాగే, రైతులకు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది.
ఆర్థికాభివృద్ధితో పాటు సుపరిపాలన
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పెరగడం వల్ల స్థానిక యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని ఉద్యోగాల ద్వారా ఇది వలసలను తగ్గించడంలో సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలు పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వ పరంగా చూస్తే, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత పారదర్శకంగా అందుతాయి. సర్టిఫికెట్ల జారీ, పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజలకే వేగంగా చేరుతుంది. మొత్తంగా, ఈ ప్రాజెక్టు గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
























