Ambati Rambabu Office Fire | అంబటి అరెస్ట్ తర్వాత శాంతించని టీడీపీ కార్యకర్తలు | ABP Desam
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి చేసిన వ్యాఖ్యలతో గుంటూరు నవభారత్ నగర్ లోని అంబటి కార్యాలయం వద్ద సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించగా..పోలీసులు అత్యంత భద్రత మధ్య అంబటి రాంబాబును అర్థరాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యకర్తలు శాంతించలేదు. అంబటిని అరెస్ట్ చేసిన వజ్ర వాహనంపై నా దాడి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కారుకు టీడీపీ కార్యకర్తలు నిప్పంటించారు. తగలబడి పోతున్న కారును పోలీసులు ఆర్పారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పంటించారు. అయితే ఆఫీసును తగలబెట్టిన విషయంపై టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలే తగలబెట్టారని వైసీపీ చెబుతుంటే...లేదు వైసీపీ కార్యకర్తలే గొడవలను మరింత పెద్దది చేసేందుకు నిప్పు అంటించారని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి అంబటి అరెస్ట్ తర్వాత పరిస్థితులు సద్దుమణగలేదు.






















