![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhatti Vikramarka: మేం అధికారంలో రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం, బీసీ బంధు తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం, బీసీ బంధు తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
![Bhatti Vikramarka: మేం అధికారంలో రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం, బీసీ బంధు తీసుకొస్తాం: భట్టి విక్రమార్క Bhatti Vikramarka Says BC Sub Plan Law Act And BC Bandhu Will Bring When Congress Comes to Power in Telangana Bhatti Vikramarka: మేం అధికారంలో రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం, బీసీ బంధు తీసుకొస్తాం: భట్టి విక్రమార్క](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/09625fd1c0d05827befd2e71f46952ba1682501519081519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhatti Vikramarka: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో భాగంగా ఆయన... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బీసీల అభ్యున్నతి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామన్నారు. అలాగే బీసీ బంధు పథకం తీసుకురావడానికి ఆలోచన చేస్తామని కూడా ప్రకటించారు. కేజీ టు పేజీ వరకు నిర్బంధ విద్యను అందిస్తామని, పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలోనే బడుగు, బలహీన వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వల్ల తెలంగాణ లక్ష్యాలు నెరవేరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని, మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని, వాగ్దానం చేసి తెలంగాణ ప్రజలను ధగా చేసిన కేసీఆర్ ను వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.
41 రోజులుగా భగభగ మండుతున్న ఎండలను భరిస్తూ.. అకాల వర్షాల్లో తడుస్తూ, గాలి దుమారానికి వేసుకున్న టెంట్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్నా పాదయాత్రను కొనసాగిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటామని అడవి బిడ్డలు తనతో పాదయాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగాలను కొల్లగొట్టడమే కాకుండా రిజర్వేషన్లు తుంగలో తొక్కుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బొగ్గు బావిలో బొంద పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మన సంపద మనకే, మన కొలువులు మనకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వెయ్యకపోగా, ఇచ్చిన ఒక నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్యార్థులు చాలా అక్రోషంగా ఉన్నారని అన్నారు. తమ జీవితాలతో చెలగాటమాడిన కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కాకతీయ విద్యార్థులు చెప్పినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్ట మొదటిగా గెలిచేది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనేని భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి రాగానే కూలి బందు పథకం తీసుకు వచ్చి ఏడాదికి 12 వేల రూపాయలు కూలీల ఖాతాలో జమ చేస్తామన్నారు. పేదలకు ఇంటి స్థలాలతో పాటు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య, డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి బండ్రు శోభారాణి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)