TRS: మరోసారి కేసీఆర్ మార్కు... ఆశావాహుల్లో పెరిగిన అసంతృప్తి..!
టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జిల్లా అధ్యక్షులను నియమించింది. ప్రజాప్రతినిధులకే అధ్యక్ష పదవులు దక్కడంపై ఆశావాహులు నిరుత్సాహపడ్డారు. అయితే కేసీఆర్ ఓ వ్యూహం ప్రకారం ఇలా చేశారన్న వాదన లేకపోలేదు.

కేసీఆర్ సొంత పార్టీలో చేసిన వ్యూహం ఇప్పుడు బెడిసి కొడుతుందా..? లేక లెక్కలు తప్పాయా? అన్నది తెలంగాణ వ్యాప్తంగా చర్చానీయంశంగా మారింది. ఆరు నెలల క్రితమే జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పదవులతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వలసలతో ఓవర్ లోడ్గా ఉన్న టీఆర్ఎస్ నావలో ఎవరికి న్యాయం చేయాలనే భావనతోనే ఇలా చేశారా.? లేక పార్టీలో ఉన్నవారికి న్యాయం చేయలేక పక్కన పెట్టారా..? అనేది ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చానీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే కొన్ని జిల్లాలో మంత్రులకు సైతం చెక్ పెట్టేందుకే ఇలా చేశారనే భావన ఉంది.
ఒక్కరు తప్ప మిగిలిన వారు ప్రజాప్రతినిధులే..
తెలంగాణలోని 33 జిల్లాలకు జిల్లా అధ్యక్ష పదవులను ఎంపిక చేసిన కేసీఆర్... ప్రజాప్రతినిధులకే పదవులు ఇవ్వడం, ఇప్పుడు పదవులు లేని వారిలో కేవలం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే మాజీ ఎంపీపీని ఎంపిక చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అన్ని పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించిన కేసీఆర్ పార్టీలోకి వచ్చిన వారికి అనేక హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల క్రితం జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపులు జరుపుతారని ప్రచారం సాగడం, ఈ దిశగా టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంతో ఆశావహులు తమ అనుకూలంగా ఉండే మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. జిల్లా అధ్యక్ష పదవి వస్తే అధికారంలో ఉన్నది తమ పార్టీ కావడంతో అంత హోదా లభించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం అనేక హామీలు తీసుకొని పార్టీలో చేరిన నాయకులు ఎలాగైనా ఈ పదవి తీసుకోవాలనే భావించి గులాబీ అధిష్టానం ముందు తమ వీర విధేయతను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే నెల రోజుల పాటు ఈ చర్చ సాగడం, ఆ తర్వాత జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపులను అధిష్టానం వెనక్కు తీసుకుందనే ప్రచారం సాగడంతో అప్పటి వరకు ఈ పదవి కోసం ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేసిన నాయకులు తమ ప్రయత్నాలను విరమించారు. కేసీఆర్ మాత్రం జిల్లాధ్యక్ష పదవులకు పోటీ పెరగడంతో సెకండ్ పవర్ పాయింట్ను ప్రోత్సహించలేక ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికే పదవులను కట్టబెట్టడంతో ప్రస్తుతం గులాబీ దళంలో చర్చానీయాంశంగా మారింది.
మంత్రులకు చెక్ పెడుతున్నారా..?
తెలంగాణా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల మద్య వైరం కొనసాగుతుంది. అంతర్గతంగానే ఇది బలపడుతుంది. అయితే ప్రస్తుతం కొన్ని జిల్లాలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల మధ్య వైరం తారాస్థాయికి చేరుకోవడంతో కొన్ని వర్గాలకు చెక్పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, కొన్ని జిల్లాలో మంత్రులను మార్చే వ్యూహంలో భాగంగానే అక్కడ జిల్లా అధ్యక్షలను నియమించారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అంతర్గతంగా ఎక్కువగా విభేదాలు నెలకొన్న ఖమ్మం జిల్లాలో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పువ్వాడ అజయ్కుమార్ సామాజిక వర్గానికే చెందిన తాతా మధును ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారనే ప్రచారం సాగుతుంది. ఇక్కడ ఇప్పటికే ఆర్జేసీ కృష్ణను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం సాగడంతోపాటు మంత్రి అనేక మార్లు కార్యకర్తలకు సైతం బహిరంగంగానే చెప్పడం, ఇప్పుడు అనూహ్యంగా తాతా మధుకు ఆ పదవి వరించడంతో పువ్వాడ మంత్రి పదవిపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో తన రాజకీయ చతురతతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రస్తుతం తీసుక్నున నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే విషయం చర్చానీయాంశంగా మారింది.





















