Kodangal Duplicate Votes: కొడంగల్లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
Special Intensive Revision SIR: కొడంగల్లో భారీగా డూప్లికేట్, కర్ణాటక ఓటర్లు ఉన్నారని కవిత ఆరోపణలు చేశారు. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పార్టీ ఆఫీసులో పలు ఆధారాలు బయటపెట్టారు.

Telangana EC, One Nation One Election One Vote: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ఓటర్ల జాబితాపై సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక ఆధారాలు వెల్లడించారు. కొడంగల్లో భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 22,433 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, వీటికి తోడు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం నియోజకవర్గానికి చెందిన 11 వేల మంది ఓటర్లు ఇక్కడ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని ఆమె ఆధారాలతో సహా ఆరోపించారు.
సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి తెలంగాణకు కేవలం ఎన్నికల డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయా అని కవిత ప్రశ్నించారు. కొడంగల్లో ఉన్న ఈ డూప్లికేషన్, సెడం నియోజకవర్గానికి చెందిన 11 వేల ఓట్లను కలిపితే మొత్తం 33 వేల ఓట్లు అవుతున్నాయని.. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఇదే మార్జిన్తో గెలిచారని ఆమె గుర్తు చేశారు. ఇలా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న ఓట్లతోనే గెలుపోటములు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో వేరే దేశాల వాళ్లకు ఓట్లు ఉండొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, దానికి తాము అంగీకరిస్తూనే.. ఒక రాష్ట్రంలో ఓటు ఉన్నవాళ్లకు పక్క రాష్ట్రంలో ఓటు ఎలా ఉంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ జనవరి 1వ తేదీని తీసుకోవాల్సి ఉండగా, ఈసారి నిబంధనలకు విరుద్ధంగా గతేడాది జనవరి 1, 2025 నాటి డేటాను రిఫరెన్స్గా తీసుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఎస్ఐఆర్ విధానంలో తీవ్రమైన వివక్ష జరుగుతోందని ఆరోపిస్తూ.. బోధన్ నియోజకవర్గంలో కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా 7 వేలకు పైగా ఓట్లను తొలగించారని, కానీ సీఎం నియోజకవర్గమైన కొడంగల్లో మాత్రం కేవలం 808 ఓట్లను మాత్రమే ఎందుకు డిలీట్ చేశారని ఆమె నిలదీశారు.
ఈసీ నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే, ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని.. కానీ బోధన్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే 7 వేల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా నటుడు ప్రకాష్ రాజ్కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉంటే, దానిని తొలగించడానికి ఏడేళ్లు పట్టిందని.. కానీ బోధన్లో ఇంత వేగంగా ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ , ఓట్ల డూప్లికేషన్ను అడ్డుకునే పటిష్టమైన మెకనిజం ఎన్నికల సంఘం వద్ద లేకపోతే, రూ.1400 కోట్లు పెట్టి చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం వృథా అవుతుందని విమర్శించారు.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 29, 2026
🔹సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు
🔹సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్ లో ఓటర్లుగా ఉన్నారు
🔹కొడంగల్ లో 22 వేల… pic.twitter.com/QhXKw3NfLJ
దేశంలో 'వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు' అనే స్పష్టమైన విధానం ఉండాలని, ఎస్ఐఆర్ ద్వారా అంతర్రాష్ట్ర డూప్లికేషన్ ఓట్లను పూర్తిగా కట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒకే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే దేశంలో ఉన్న సంచార జాతుల ఓటు హక్కు నమోదుపై ఈసీ స్పష్టత ఇవ్వాలని కోరారు. తాము లేవనెత్తిన సాంకేతిక మరియు లీగల్ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఒక కొత్త రాజకీయ పార్టీగా తమకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జాబితా అత్యంత ప్రాముఖ్యమైనదని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















