Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?
కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తోపులాటలో చిన్నారి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

నాగర్కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవ కారణంగా రెండు నెలల చిన్నారి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డుపై 5 గంటలపాటు రాస్తారోకో చేయగా.. చివరకు డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం ఆందోళన విరమించింది.
వివాదానికి కారణమైన టికెట్ ధర
కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవదర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా, టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. రూ.100 చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా.. తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు, గణేశ్ కుటుంబానికి మధ్య గొడవ జరగగా, అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కిందపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2026
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
తక్కువ… pic.twitter.com/9c1dOb3JtY
కేసు నమోదు చేసిన పోలీసులు
చనిపోయిన చిన్నారి తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, రిపోర్టు ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

చిన్నారి మృతిపై నాగర్కర్నూల్లో 5 గంటల పాటు రాస్తారోకో
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితులతో కలిసి వివిధ ప్రజాసంఘాలు శనివారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై భారీ ఆందోళన చేపట్టాయి. ఈ నిరసన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితులకు మద్దతుగా BSP, DSP, BC-SC-ST-JAC, MRPS మరియు ఇతర సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పోలీసుల హామీతో ఆందోళన విరమణ
సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు నాగర్కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డీఎస్పీ భరోసాతో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో విశారదన్ మహరాజ్ సభ్యులు, బాధిత కుటుంబానికి చెందిన వారు ధర్నా విరమించారు.
























