Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో ఏపీలో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనుండగా.. మిగతా జిల్లాల్లో వడగాల్పులు వీచనున్నాయి.

Rains In Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు వడదెబ్బతో అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన వడగాల్పులు వీస్తున్న క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత కీలకమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం (మే 31న) వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఎండల ప్రభావం అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం పూట బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
THUNDERSTORMS TO INCREASE FROM TONIGHT - May 31, 2026 ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) May 31, 2026
Today, till night mainly dry weather expected
Scattered INTENSE THUNDERSTORMS ahead in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Kamareddy, Mancherial, Rangareddy, Vikarabad, Nalgonda, Nagarkurnool during OVERNIGHT -…
పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు భయపెడుతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావంతో నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్ష సూచన ఉంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అకాశం ఉన్నందున, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ద్రోణి ప్రభావంతో ఏపీలో తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తాజాగా పలుచోట్ల కురుస్తున్న వర్షాలు ఎండల నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
రాయలసీమలో వర్షాలు..
నేడు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం వరకు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 51 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Also Read: PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
17 మండలాల్లో వడగాల్పులు
రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మండలాలపై వడగాల్పుల (Heatwaves) ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. శనివారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు తగ్గుతున్నప్పటికీ, వడగాలులు వీస్తున్నాయి కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















