Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు
Basara Latest news: వసంత పంచమి సందర్భంగా బాసరలో వేడుకలు ఘనంగా నిర్వహించారు తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు బారులు తీరారు.

Basara Latest news: నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర క్షేత్రానికి వసంతపంచమి శోభ సంతరించుకుంది. జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి వేకువజామున నుంచే భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో అధిక సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అమ్మవారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతుంది.

అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వేకువజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాయంత్రం అమ్మవారికి వంద వీణలతో కచ్చపీ అష్టోత్తర శతవీణానాద నీరాజనాన్ని అందించనున్నారు. వసంతపంచమి రోజు అక్షరాభ్యాసానికి అత్యంత శుభదినం కావడంతో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

వేకువ జామున మూడు గంటల నుంచే అక్షరాభ్యాస మండపాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మూడు అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తుల కోసం నీరు, పాలు, బిస్కెట్ లు అందిస్తున్నారు.

అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోత్తరంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వసంత పంచమి పర్వదినానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేస్తామని వివరించారు. 200 కోట్ల రూపాయల నిధులతో, బాసర అభివృద్ధికై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారు. బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు, కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















