BRS MLC Kavitha: పసుపు బోర్డును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత, గాలి మాటలు మానేయాలని ఎంపీ అర్వింద్కు చురకలు
Nizamabad News | పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించడంతో పాటు దిగుమతులపై ఆంక్షలు విదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Nizamabad Turmeric Board | నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని, మరోవైపు మద్దతు ధర పెంచాలి. ఈ రెండు జరిగినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత వస్తుంది. అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందన్నారు. ఏదో తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరికాదని, వారికి తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
మేం ఒత్తిడి తెచ్చినందుకే పసుపు బోర్డు
స్పైసిస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ అప్పుడు రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పసుపు బోర్డు Turmeric Board) ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని కేవలం బీజేపీ కార్యక్రమంలా చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కనీసం ప్రొటొకాల్ ను పాటించలేదు. ఇది ప్రభుత్వ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధం. కేవలం బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ వేదికమీద కూర్చొని ప్రారంభించుకున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం.
2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను. దీనిపై మద్దతు కోరుతూ పలువురు ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు సేకరించాను. ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా. పార్లమెంటులో పలుమార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాను. అయితే కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా కనీస మద్ధతు ధరను ప్రకటించాలి. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్రానికి వినతులు అందించా. ఇలా గతంలో నేను త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని’ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాం. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి వల్ల మన రైతులు నష్టపోతున్నారు. కనుక దిగుమతులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. 2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతి కాగా, ఇప్పుడు రెట్టింపు అయింది. దిగుమతులు పెరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు.
బెంజ్ కారు కొంటే అంబాసిడర్ ఎందుకిచ్చారు ?
బీజేపీ ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్ధతు ధర సాధించాలని ఎంపీకి సూచించారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అని అర్వింద్ గతంలో అన్నారు. మరి పసుపును అంత అవహేళన చేసిన అర్వింద్ కు ఇప్పుడు పసుపు బోర్డు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మేం పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీలో తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. “ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్... గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బెటర్ అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు అని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అనడంపై ఎద్దేవా చేశారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే... అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు? ఎంపీ అర్వింద్ గాలి మాటలు మానేసి, మద్దతు ధర సాధించాలని కవిత సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

