Telangana News: నేడు మంచిర్యాలలో బహిరంగ సభ, డిప్యూటీ సీఎం భట్టితో పాటు హాజరుకానున్న పలువురు మంత్రులు
MLA Prem Sagar Rao | మంచిర్యాల జిల్లాలో పలు కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. అనంతరం భారీ బహిరంగ నిర్వహిస్తామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.

Bhatti Vikramarka News Today | మంచిర్యాల: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ నేడు (సోమవారం) మంచిర్యాలలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ తెలిపారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అలాగే రాళ్ళవాగు పక్కన కరకట్ట నిర్మాణానికి శంఖుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చూడతారని తెలిపారు. మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ లో వాటర్ ట్యాంక్, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుంది. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండుటెండలోనూ 40 వేల మంది ఈ సభకు హాజరవుతారని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీకి ఎంతో బలమన్నారు.

‘85 శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగింది. సన్న బియ్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచితంగా సన్ని బియ్యం పంపిణీ తో ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చాం. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ధికంగా సతమతం అవుతోంది. డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వేంపల్లిలో ఇండస్త్రీయల్ పార్క్ కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని’ ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.
మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందన్నారు. నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారని అన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.






















