Adilabad Latest News :వడ్డీ వ్యాపారులపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆకస్మిక దాడులు- 18 కేసులు నమోదు
వడ్డీ వ్యాపారులపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా జలుపించారు. ఏకకాలంలో 43 బృందాలతో 13 మండలాలలో దాడులు నిర్వహించారు.అధిక వడ్డీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Adilabad Latest News :రైతులు అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై కొరడా జలుపిస్తున్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 13 మండలాలలో 43 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలో దాదాపు 18 కేసులు నమోదు చేశారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుంచి ప్రామిసరీ నోట్ల బాండ్లు, చెక్కుబుక్కులు ఖాళీ పేపర్స్ స్టాంప్ పేపర్స్, సేల్ డీడ్స్ లాంటివి స్వాధీనం చేసుకున్నారు.

నార్నూరు మండలంలో బంగారం కుదువ పెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి వద్ద నుంచి 12 గ్రాముల బంగారం 235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడు ఉట్ల రవి, లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ పై కేసు నమోదు చేశారు. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమార్కుల ఆటలు కట్టడం చేయడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, తలమడుగు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు,బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు, బేల పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, నార్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు మొత్తం 18 కేసులు నమోదయాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ వడ్డీ పేరుతో నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేలా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఇలాంటి ఆకస్మిక తనిఖీలను చేపట్టడం జరుగుతుందని అధిక వడ్డీలకు ఇచ్చే వడ్డీ వ్యాపారులు ప్రజలను మోసం చేయడం మానివేయాలని సూచించారు.






















