![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Graduates MLC Election: బీఆర్ఎస్ చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం, మరోసారి మోసపోతే మనదే తప్పు: KTR
Telangana Graduates MLC Election | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన మంచిని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Graduates MLC Election: బీఆర్ఎస్ చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం, మరోసారి మోసపోతే మనదే తప్పు: KTR KTR campaign for Rakesh Reddy in Warangal Khammam Nalgonda Graduates MLC Election Graduates MLC Election: బీఆర్ఎస్ చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం, మరోసారి మోసపోతే మనదే తప్పు: KTR](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/f34858a58082c4be2a28b0d20bf02d811716117456492233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Warangal Khammam Nalgonda Graduates MLC Election | భువనగిరి: బీజేపీ నేతల్ని ఈ 10 ఏళ్లలో ఏం చేశారని అడిగితే, మేము గుడి కట్టినం అంటారు. అంతకుమించి సమాధానం రాదు. అలాగైతే కేసీఆర్ యాదాద్రి కట్టలేదా? ఆధునిక దేవాలయాలుగా చెప్పబడే ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్లు కట్టారు. వాటికి కూడా దేవుళ్ల పేర్లే పెట్టారు. దేవాలయాలు, ఆధునిక దేవాలయాలను కూడా కేసీఆర్ కట్టారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్ల కిందట నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు మీకు తెలుసు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా అన్నారు. విదేశీయులు మన పాస్ పోర్ట్ కోసం ఎగబడేలా చేస్తానన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని మోడీ అన్నారు. ఒక్క రైతుకన్నా ఆదాయం డబులైందా?. ప్రజలకు మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు.
బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేసినా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. గతంలో నల్గొండ జిల్లాలో తాగు, సాగునీటి కష్టాలు, ఫ్లోరోసిస్ ఉండేవి. కేసీఆర్ సీఎం అయ్యాక నల్గొండ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు. దేశానికి తెలంగాణ అన్నం పెడితే... అందులో నల్గొండ నంబర్ వన్. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి కాలరెగిరేసుకొని చెప్పుకునేలా జిల్లాను డెవలప్ చేశారు. ఉమ్మడి జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు, నల్గొండ జిల్లాను మూడు జిల్లాలుగా మార్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టగా.. దాని పనులు ప్రారంభమయ్యాయి. అయినా నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో 11 చోట్ల ఓడిపోయాం’ అన్నారు కేటీఆర్.
చేసిన పనిని చెప్పుకోలేకపోయాం...
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో మనం చేసిన పనుల్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పుకోలేకపోవడమే ఎన్నికల్లో ఓటమికి కారణం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధిక జీతాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయాం. దేశంలోనే అత్యధికంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయాం అన్నారు కేటీఆర్. ప్రత్యర్థి పార్టీలు మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్పి ఆరు నెలలు గడిచిందని, మరోసారి మోసపోతే మనదే తప్పు అవుతదని గ్రాడ్యుయేట్స్ కు సూచించారు.
రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు కూలీలు, కౌలు రైతులకు ఆర్థిక సాయమని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని గ్రహించాలన్నారు. కోటి 67 లక్షల మంది మహిళలకు రూ. 2500 ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలని రేవంత్ రెడ్డి చెప్పాడు కానీ, కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తాము ఇచ్చామని చెప్పుకోవడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందిని ఎద్దేవా చేశారు. 5 వేల ఉద్యోగాల డీఎస్సీని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, ఫీజులు వసూలు చేయకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నారు. కానీ రూ.2000 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాకేష్ రెడ్డిని గెలిపించండి..
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు. సమయం తక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధి చాలా పెద్దది. భువనగిరి పరిధిలోనే 13 వేల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ వైపు మాత్రం బ్లాక్ మెయిలర్ అభ్యర్థిగా ఉంటే, బీఆర్ఎస్ నుంచి విద్యావంతుడు ఉన్నాడని చెప్పారు. ఈ శాసన మండలి నియోజకవర్గంలో నాలుగుకు 4 సార్లు బీఆర్ఎస్ నే గెలిపించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టినా బిట్స్ పిలానీలో చదువుకున్నారని, అమెరికాలో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా, ప్రజాసేవ కోసం వచ్చారని కేటీఆర్ తెలిపారు. రాబోయే వారం రోజుల పాటు కష్టపడి పనిచేయాలని, మొదటి ప్రియార్టీ ఓటు మాత్రమే వేయాలని కేటీఆర్ సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)