Kalvakuntla Kavitha Chit Chat: అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేస్తా - రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు
Kavitha: మేలో కొత్త పార్టీ పెట్టనున్నట్లుగా కవిత ప్రకటించారు. తన మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట నుంచి పోటీ చేయడమన్నారు.

Kavitha Entry from Siddipet: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మీడియా ప్రతినిధులోత నిర్వహించిన ఇష్టాగోష్టిలో కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక, సాంస్కృతిక సేవలో ఉన్న తెలంగాణ జాగృతి, ఇకపై రాజకీయ క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.
పార్టీ పేరుపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. తాను స్థాపించబోయే పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత ధృవీకరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీల్లో తెలంగాణ అని లేదని.. తెలంగాణ రాష్ట్ర సమతిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత .. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ లేకుండా పోయిందని ఆమె భావిస్తున్నారు. అందుకే తెలంగాణ పేరును తన పార్టీలో పెట్టాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ విధానాలతో విబేధించి బయటకు వచ్చిన తాను, ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాసనమండలిలో రాజీనామా ఆమోదం పొందే ముందు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను.. ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే కొత్త ప్రత్యామ్నాయం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుందని, తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. అభ్యర్థిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూనే, తన ప్రాధాన్యతలను వెల్లడించారు. పోటీకి సంబంధించి మొదటి చాయిస్గా సిద్దిపేటను, రెండో చాయిస్గా బోధన్ను ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంతటా పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఇప్పటికే జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. హరీష్ రావును కవిత మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధిపేట నుంచే పోటీ ఆలోచన ఉన్నట్లుగా ప్రకటించడం హైలెట్ అవుతోంది. సిద్దిపేట గతంలో కేసీఆర్ కంచుకోటగా ఉండేది. ఆయన తర్వాత హరీష్ రావు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, సరైన వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి కనుసన్నల్లో కాకుండా, స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏప్రిల్ లేదా మే నాటికి పార్టీ విధివిధానాలు, జెండా, ఎజెండాను పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.























