Kamareddy Latest News:కామారెడ్డి జిల్లాలో మరో దారుణం- ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తూ ఆటో నుంచి పడిన విద్యార్థినులు- ఒక పాప మృతి
Kamareddy Latest News: స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కామారెడ్డిలో జరిగిన ఘటన చూసి ఎమ్మెల్యే కంట తడి పెట్టుకున్నారు.

Kamareddy Latest News: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తున్న విద్యార్థులు ఆటో నుంచి పడ్డారు. అందులో ఒక బాలిక మృతి చెందింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ వద్ద ధర్నాకు దిగారు. ఇంతటి దారుణానికి కారణమైన ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాన్సువాడలోని బోర్లం క్యాంపులో సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వద్ద ఈ దారుణం జరిగింది. ఆదివారం ప్రిన్సిపల్ సునీత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు. దీని కోసం స్కూల్ నుంచి ఫర్నీచర్ తీసుకెళ్లారు. అదే ఆటోలో కొందరు విద్యార్థినులను కూడా రప్పించారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పిల్లలను, ఫర్నీచర్ను మళ్లీ పాఠశాలకు పాసింజర్ ఆటోలో పంపించారు. ఇలా పంపే క్రమంలోనే ప్రమాదం జరిగింది.
ఫర్నీచర్ ఉన్న ఆటోలో కూర్చోవడానికి బాలికలు ఇబ్బంది పడ్డారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆటో అటూ ఇటూ ఊగుతూ వెళ్తున్న సమయంలో ముగ్గురు విద్యార్థినులు బయటకు దూకేశారు. అందుకో ఒకరు పడిపోయారు. ఇంకో విద్యార్థి ఆటోలోనే ఉండిపోయింది. కాస్త దూరం వెళ్లే సరికి ఆమె కూడా కింద పడిపోయింది. ఇవేవీ గమనించిన ఆటో డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.
ముందుగా పడిన విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చివరిగా పడిన విద్యార్థిని సంగీత తలగు బలమైన గాయమైంది. విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
చదువుల తల్లి చిన్నారి మృతి వార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. క్షేమంగా చూసుకుంటారని గురుకుల పాఠశాలకు పంపిస్తే అక్కడే ప్రాణాలు తీశారని సిబ్బందిపై తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గేటు ముందు డెడ్బాడీతో బైఠాయించి ధర్నా చేశారు. ప్రిన్సిపల్తోపాటు అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అక్కడ వారి బాధను చూడలేక కంటతడి పెట్టుకున్నారు. వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
విద్యార్థిని మృతిపై రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థి మృతికి ప్రిన్సిపల్ కారణమయ్యారంటూ బిజెపి నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులను నిరసనలు తెలియజేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారెవర్నీ పాఠశాలలోకి అనుమతించక పోవడంతో పాఠశాల గేటు ముందు ఆందోళన దిగారు. వారికి మద్దతుగా బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కార్యకర్తలతో కలిసి పాఠశాల గేటు ముందు నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా వివరాలు సేకరించారు. విద్యార్థి మృతి గల కారణాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టాలని ప్రభుత్వం విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడలో అఖిలపక్షం నాయకులు, విద్యార్థి సంఘాలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు



















