CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
Hyderabad Bengaluru as defence and aerospace corridor | బెంగళూరు

Safran Aircraft Engine MRO Facility | శంషాబాద్: శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సాఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) సెంటర్ ను ఆన్ లైన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త MRO యూనిట్కు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బెంగళూరు- హైదరాబాద్ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ముఖ్యమం రేవంత్ రెడ్డి భారత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్లో ఏరోస్పేస్ వృద్ధిలో మైలురాయి
హైదరాబాద్లో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణపై పూర్తి నమ్మకంతో హైదరాబాద్ను తమ కార్యకలాపాలకు ఎంచుకున్న సఫ్రాన్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశంలోనే LEAP ఇంజిన్ల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్ కావడం విశేషం. రూ.1,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం ద్వారా 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించడంతో పాటు, మన స్థానిక ఎంఎస్ఎంఈలు (MSMEs), ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

సఫ్రాన్కు చెందిన M88 మిలిటరీ ఇంజిన్ MRO కి కూడా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఈ మిలిటరీ MRO భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్లలో ఒకటిగా నిలవనుంది. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎం.ఎస్.ఎమ్.ఈ. విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZల కారణంగా సఫ్రాన్, బోయింగ్, ఎయిర్బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ ప్రపంచ కంపెనీలు తయారీ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు హైదరాబాద్ను ఎంచుకున్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ MRO, ఏరో ఇంజిన్ హబ్లలో ఒకటిగా రూపుదిద్దుకుందన్నారు.

‘ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధిని వివరిస్తూ, గత ఏడాది మన ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. కేవలం 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు చేరుకున్నాయి. మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించడం విశేషం. తెలంగాణ ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏరోస్పేస్ అవార్డును అందుకుంది. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం (స్కిల్లింగ్) చాలా ముఖ్యమైన ప్రమాణమని గుర్తించిన ప్రభుత్వం టాటా టెక్నాలజీస్తో భాగస్వామ్యం చేసుకుంది. రాష్ట్రంలోని 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను (ఐటీఐఎస్) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందని’ రేవంత్ రెడ్డి తెలిపారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం ఈ విజన్ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్’ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ ఆహ్వానించారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.






















