KTR US Tour: చదువు పూర్తయ్యాక భారత్లో కంపెనీలు పెట్టండి- టెక్సాస్ - డల్లాస్ వర్సిటీ విద్యార్థులకు కేటీఆర్ పిలుపు
Telangana News | అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ టెక్సాస్ డల్లాస్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఉన్నత విద్య పూర్తయ్యాక భారత్కు తిరిగొచ్చి కంపెనీలు స్థాపించాలని పిలుపునిచ్చారు.

KTR US Tour News Updates | అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన విద్యార్థులు అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. అమెరికా నుంచి విద్యార్థులు భారత్కు తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం ఎంతో బాధ పడుతుందన్నారు కేటీఆర్. అందుకే విద్యార్థులకు అండగా నిలుస్తామన్నారు. అమెరికా చట్టాలతో పాటు అక్కడి మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని విద్యార్థులకు కేటీఆర్ సూచించారు. స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన చేసుకోవాలన్నారు.
నేడు అందుబాటులోకి సౌకర్యాలు, చదువు
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో చదువుకుంటున్న విద్యార్థులతో మాజీ మంత్రి కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అమెరికా పోవాలన్నా, చదువుకోవాలన్నా ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వాళ్లం. ప్రపంచం వేగంగా మారిపోగా నేడు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ క్రమంలో అమెరికా విద్య కూడా విదేశాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందన్నారు.

కేవలం ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో చదవకుండా తమ జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల పైన ఫోకస్ చేయాలన్నారు కేటీఆర్. మనిషి జీవితంలో 50 సంవత్సరాలు చూస్తుండగానే పూర్తి అవుతాయి. ఇంత స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా, మనల్ని ఎవరైనా వెనక్కి లాగినా నిబద్ధతతో ముందుకు సాగిపోవాలన్నారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.
రిస్క్ తీసుకుంటేనే కలలు సాకారం..
ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడి రాణించాల్సి ఉంటుంది. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న మన దేశానికి చెందిన విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై ఫోకస్ చేయాలి. రిస్కు తీసుకుంటేనే మీ కలలు సాకారం అవుతాయి అనడానికి కెసిఆర్ జీవితమే సాక్ష్యం.నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేసి తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టారు. కానీ ఆరోజు ఎంతోమంది ఆయనను అవహేళన చేశారు. కానీ 14 సంవత్సరాల నిరంతర పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ పై ప్రతి ఒక్కరు ప్రశంసల కురిపించారని’ గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్.
ఇండియాకు వచ్చి కంపెనీలు పెట్టండి..
పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఓపికగా సమాధానం చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక మన దేశానికి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. దేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. మేథోవలస ( brain drain) మన దేశానికి పెను సవాలుగా మారిందని, విద్యార్థులు, యువత దేశాభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.






















