నిమ్స్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత.. విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి
గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతిచెందారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె కన్నుమూశారు.

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య శనివారం రాత్రి 9:41 గంటలకు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం గత వారం రోజులుగా శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సౌమ్య మరణం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం, సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్, వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్, ఇతర అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగింది..
జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టి ఆమె పైనుంచి దూసుకెళ్లారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది.
సౌమ్య వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని గతంలోనే మంత్రులు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 25 ఏళ్ల సౌమ్య 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. గత 20 నెలలుగా నిజామాబాద్లో సేవలు అందిస్తున్నారు. కానీ డ్యూటీ చేస్తుండగా ఓ గంజాయి బ్యాచ్ చేసిన అరాచకానికి సౌమ్య ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపుతోంది.
























