Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Karimnagar News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనపై నమోదైన కేసులన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

BRS MLA Padi Kaushik Reddy Got Bail: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ (Karimnagar) రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ప్రేమలత మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. 2 కేసుల్లో రూ.25 వేల చొప్పున రూ.50 వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. ఆయనకు రిమాండ్ విధించాలన్న పోలీసుల రిపోర్టును కొట్టేశారు. అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతకు ముందు కరీంనగర్ పీఎస్లోనే పాడి కౌశిక్రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం జడ్జి ఎదుట హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించాలన్న పోలీస్ రిపోర్టుపై వాదనలు సాగాయి.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు, 2 కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసి హైడ్రామా క్రియేట్ చేశారని.. 2 కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో ఏమైనా మారుస్తారేమో చూడాల్సి ఉందని పేర్కొంది. కాగా, పాడి కౌశిక్రెడ్డిపై మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ వన్ టౌన్లో 3 కేసులు, త్రీటౌన్ పీఎస్లో 2 కేసులు నమోదయ్యాయి.
ఇదీ జరిగింది
కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. కరీంనగర్ పోలీసులకు సంజయ్తో పాటు కొందరు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు కాగా.. సోమవారం సాయంత్రం ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు. రాత్రంతా కౌశిక్రెడ్డి జైల్లోనే ఉండగా.. ఉదయం వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మరోవైపు, కౌశిక్రెడ్డి అరెస్టుతో కరీంనగర్ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు. నేతలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
'అక్రమ అరెస్టులకు భయపడేది లేదు'
అక్రమ అరెస్టులకు తాను భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి (Padi Kaushik Reddy) తెలిపారు. మంగళవారం కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్ నుంచి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా.. పోలీస్ వాహనం నుంచే ఆయన మీడియాతో మాట్లాడారు. 'అమ్ముడుపోయిన ఒక ఎమ్మెల్యేను నిలదీసినందుకు నాపై అక్రమ కేసులు పెట్టారు. పండుగ పూట రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటాను. జై తెలంగాణ.' అంటూ నినాదాలు చేశారు.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు























