Bandi Bhagirath POCSO Case: పోక్సో కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్ - బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫాంహౌస్కు తీసుకెళ్లి పోలీసుల సోదాలు!
Bandi Bhagirath: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను మేడ్చల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు

Bandi Bhagirath Moinabad Farmhouse Investigation: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు నేడు చర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. బుధవారం ఉదయం జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన పోలీసులు, తొలుత ఆయనకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య విచారణ ప్రక్రియను ప్రారంభించారు.
మొయినాబాద్ ఫాంహౌస్లో సీన్ ఆఫ్ అఫెన్స్
వైద్య పరీక్షల అనంతరం భగీరథ్ను పోలీసులు నేరుగా మొయినాబాద్లోని ఫాంహౌస్కు తరలించారు. ఈ ఫాంహౌస్లోనే బాధితురాలిపై అఘాయిత్యం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఘటన జరిగిన రోజున ఏం జరిగిందనే అంశంపై నిందితుడి నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్లో భాగంగా క్షుణ్ణంగా సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు, ఆ తర్వాత ఆయనను కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
మొయినాబాద్ ఫార్మ్హౌస్కు బండి భగీరథ్
— Telangana First (@TelanganaFirst_) May 27, 2026
విచారణ నిమిత్తం బండి భగీరథ్ను మొయినాబాద్లోని అరణ్య ఫార్మ్హౌస్కు తరలించిన పోలీసులు. https://t.co/YC8mAO8OkH pic.twitter.com/y2F46d0Sgo
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ విచారణ
తదుపరి విచారణ నిమిత్తం బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం 6:30 గంటల వరకు విచారణ కొనసాగినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు బండి భగీరథ్ను పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాధితురాలి తల్లి చేసిన ఆరోపణలు, సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాలను నిందితుడి ముందు ఉంచి విచారణ కొనసాగించినట్లు సమాచారం. ముఖ్యంగా ఫోన్ డేటా, ఘటన జరిగిన సమయంలో నిందితుడి కదలికలపై పోలీసులు లోతైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. డీసీపీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం, నిందితుడిని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కీలక విషయాలు రాబట్టనున్న పోలీసులు
కస్టడీ విచారణలో భాగంగా కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలోని బృందం భగీరథ్పై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ముఖ్యంగా, బాధితురాలితో పరిచయం ఎప్పుడు మొదలైంది? అసలు మీ మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఆమెను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అన్న కోణంలో ప్రాథమిక విచారణ సాగుతోంది. అలాగే, మొయినాబాద్ ఫాంహౌస్కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? అమ్మాయి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు నీ ఫోన్ నుంచే బయటకు వచ్చాయా? అంటూ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. వీటితో పాటు, అరెస్టుకు ముందు 9 రోజుల పాటు ఎక్కడ తలదాచుకున్నారు? ఎవరెవరు ఆశ్రయం ఇచ్చారు? అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు.
మరీ ముఖ్యంగా, "నువ్వు ఏ తప్పూ చేయకపోతే ఫోన్లోని డేటా, వాట్సాప్ చాట్లను ఎందుకు డిలీట్ చేశావ్?" అనే ప్రశ్నకు నిందితుడి నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రిట్రీవ్ చేసిన డిజిటల్ సాక్ష్యాధారాలను నిందితుడి ముందు ఉంచి విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















