Breaking News: దిల్లీలో మళ్లీ ప్రభుత్వ సిబ్బందికి వర్క్ఫ్రమ్ హోం .. సుప్రీం ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణలపై ఉంది. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నిన్నటి మాదిరిగానే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు, ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యాకారులను సైతం వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో నవంబర్ 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.
తెలంగాణలో ఇలా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ప్రభావం తెలంగాణపై ఉండనుంది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో ధాన్యం తడిచే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ వెండి మాత్రం కేజీకి రూ.800 పెరిగింది. 22 క్యారెట్ల ధర గ్రాముకు రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.50,070గా ఉంది. హైదరాబాద్లో, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070, దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.
దేశంలో చమురు ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ. 94.62, లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.107.88గా ఉంది. డీజిల్ ధర రూ.94.31 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా.. ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.96.36గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.57గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.08 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.66గా ఉంది.
మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడని టీఆర్ఎస్ నేతపై కేసు
సిరిసిల్ల జిల్లా యువజన టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు మనోజ్పై కేసు నమోదైంది. మహిళా ఎస్సైపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని సీఐ అనిల్ వెల్లడించారు. సిరిసిల్లలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ పడగా.. ఆపేందుకు వెళ్లిన మహిళా ఎస్సై పట్ల మనోజ్ అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రధానిపై రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నిరసనకు దిగింది. గాంధీ చౌక్ వద్ద రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు
తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.





















