Asia Cup 2025: ఆసియా కప్ నుంచి వైదొలిగిన భారత్! బీసీసీఐ నిర్ణయంతో పాకిస్తాన్కు షాక్
India vs Pakistan | 2025 ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండగా ACC ఈవెంట్ల నుంచి భారత్ తప్పుకుంది. బీసీసీఐ తమ నిర్ణయాన్ని లేఖ రాసినట్లు సమాచారం.

ముంబై: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ (Asia Cup) మెగా టోర్నీ నుంచి టీమిండియాం వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లతో భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఏషియా క్రికెట్ కౌన్సిల్ (ACC) యొక్క అన్ని కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, వచ్చే నెలలో శ్రీలంకలో జరగాల్సిన మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్, సెప్టెంబర్లో జరగాల్సిన పురుషుల ఏషియా కప్ నుండి తప్పుకుంటున్నట్లు ACC కి బీసీసీఐ తెలియజేసింది. తమ నిర్ణయాన్ని ఏషియా క్రికటె్ కౌన్సిల్కు తెలియజేస్తూ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ACCకి పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వి నేతృత్వం వహిస్తున్నారు. అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు గానూ కొనసాగుతున్నారు. దాంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దౌత్య పరంగా పాకిస్తాన్ను ఒంటి చేయాలని చూస్తున్న భారత్.. అటు క్రికెట్లోనూ దాయాదిని ఒంటరి చేసి, ఇరుకున పెట్టాలని చూస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి.
BCCI ఒక అధికారిని ఉటంకిస్తూ "పాకిస్తాన్ మంత్రి నేతృత్వంలోని ACC నిర్వహించే టోర్నమెంట్లో భారత జట్టు పాల్గొనదు. ఇది దేశం కోసం తీసుకున్న నిర్ణయం. మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్ నుండి తప్పుకుంటున్నట్లు వారు నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆటగాళ్ల భద్రతతో పాటు జాతీయత, దేశ సమగ్రత ముఖ్యమని" పేర్కొంది.
పురుషుల ఏషియా కప్ వాయిదా పడవచ్చు
ఈ ఏడాది సెప్టెంబర్లో పురుషుల ఏషియా కప్ 2025 జరగాల్సి ఉంది. దీనికి భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పాల్గొనే ఈ టోర్నమెంట్ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ పాల్గొనే మెగా టోర్నీలపై బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది.
భారతదేశం లేకుండా ఏషియా కప్ నిర్వహించడం సాధ్యం కాదని BCCIకి తెలుసు, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లలో భారత్ పాల్గొంటేనే కాసుల వర్షం కురుస్తుంది. అటువంటిది భారత్ లాంటి దేశం ఏషియా కప్ ఆడకపోతే పాక్ మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే ఏషియా కప్పై ప్రసారహక్కులకు ఎవరూ ముందుకు రారు.
ఏషియా కప్ హక్కులను 2024లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 170 మిలియన్ అమెరికన్ డాలర్లకు తదుపరి 8 సంవత్సరాలకు పొందింది. ఈ టోర్నమెంట్ ఈ ఎడిషన్ జరగకపోతే, ఒప్పందంలో కొన్ని మార్పులు జరగవచ్చు.
2023లో జరిగిన ఏషియా కప్ గత ఎడిషన్ సైతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితితో ప్రభావితమైంది. ఆ సమయంలో ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్ కనుక, భారత్ ఆ దేశానికి వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో ఆడాలని నిర్ణయించారు. ఎలాగూ ఆ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్కు చేరుకోలేదు. కోలంబోలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే ఫార్ములా అనుసరించారు. ఇండియా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. ఈసారి ఆతిథ్యం వహించిన పాకిస్తాన్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.





















