![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ODI World Cup 2023: అహ్మదాబాద్ చేరుకున్న గిల్, భారత్-పాక్ మ్యాచ్లో ఆడతాడా?
ODI World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
![ODI World Cup 2023: అహ్మదాబాద్ చేరుకున్న గిల్, భారత్-పాక్ మ్యాచ్లో ఆడతాడా? IND vs PAK So will Shubman play in the India-Pakistan match? Gill reached Ahmedabad before the match ODI World Cup 2023: అహ్మదాబాద్ చేరుకున్న గిల్, భారత్-పాక్ మ్యాచ్లో ఆడతాడా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/12/1fef687ab8faa1c820bdf5b21f0803b81697084260142872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై , రెండో మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ శనివారం అసలు సిసలు సమరానికి సిద్ధమవుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో శనివారం టీమిండియా తలపడబోతోంది. ఈ క్రమంలో అందరి దృష్టి స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్పై పడింది. డెంగ్యూ కారణంగా చెన్నైలో ఆస్పత్రిలో చేరి చికిత్స తర్వాత కోలుకున్న గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ కీలక మ్యాచ్లో గిల్ ఆడతాడా.. లేక టీమ్ మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు.
శనివారం జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం శుభ్మన్ గిల్ (Shubman Gill) అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ టీమిండియా ఓపెనర్.. ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నదానిపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం శుబ్మన్ పాక్తో మ్యాచ్లో ఆడడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గిల్ ఫిట్గా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోవచ్చు. గిల్ ఆరోగ్య పరిస్థితిపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ వేగంగా కోలుకుంటున్నాడని, ఎప్పటికప్పుడు వైద్య బృందం పర్యవేక్షిస్తూ ఉందని, త్వరలోనే గిల్ మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నామని రాఠోడ్ వెల్లడించారు. గిల్ ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు కోలుకున్నాడు. అయితే, ఏ మ్యాచ్లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టమని స్పష్టం చేశాడు. గిల్ అందుబాటులో లేకపోయినా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగానే ఉందని, అనుభవం కలిగిన బ్యాటర్లు జట్టులో ఉన్నారని భారత బ్యాటింగ్ కోచ్ అన్నాడు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసన్న రాఠోడ్.... మైదానంలోకి దిగిన తర్వాత ఎలా ఆడాలనే స్వేచ్ఛ వారికి ఇచ్చామని, కాబట్టి కేవలం ఒక్కరి మీదనే టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడదని తేల్చి చెప్పాడు.
గిల్ ఆరోగ్యంపై మాజీ విధ్వంసకర బ్యాట్సమెన్ రాబిన్ ఊతప్ప కూడా స్పందించాడు. గిల్ త్వరగా కోలుకోవాలని, జట్టులోకి త్వరగా తిరిగి రావాలని మనందరం కోరుకుందామని, కానీ డెంగ్యూ నుంచి కోలుకుని బలమైన కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టమని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు. ఫిజికల్గా డెంగ్యూ చాలా దెబ్బతీస్తుందని, సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే తాను కూడా ఎదుర్కొన్నానని ఊతప్ప గుర్తు చేసుకున్నాడు. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం వరకు ఎముకల్లో నొప్పి ఉంటుందని, గిల్పై దీని ప్రభావం ఎక్కువగా ఉండకూడదని కోరుకుంటున్నానంటూ ఊతప్ప తెలిపాడు.
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకోని గిల్ పాక్తో మ్యాచ్కు సిద్ధం కావడం కష్టమేనన్న అభిప్రాయమూ విశ్లేషకుల్లో నెలకొంది. దీంతో ఓపెనర్గా ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాకిస్థాన్తో మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది. అక్టోబరు 19న పూణెలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్తో మ్యాచ్ ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)