BCCI Meeting: గంభీర్, అగార్కర్లకు బీసీసీఐ నుంచి పిలుపు - వారి కథ ముగిసినట్లేనా?
BCCI: భారత జట్టు భవిష్యత్తు గురించి చర్చించేందుకు గంభీర్, అగార్కర్లలతో బోర్డు వర్గాలు సమావేశమవుతున్నాయి. అలాగే ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఆడే జట్ల ఎంపికపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Team India News: భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూకు రంగం సిద్ధం చేయబోతోంది. భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇప్పటికే బోర్డు అధికారులతో మీటింగ్ కోసం ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల భారత జట్టు ఎదుర్కొన్న ఘోర ఓటముల గురించి తెలుసుకోనుంది. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ కావడం, దీంతో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ను కోల్పోవడంపై చర్చించనున్నారు. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో టీమిండియా ఓడిపోవడంపైనా నివేదిక కోరనున్నారు. తాజా ఓటమితో పదేళ్ల తర్వాత బీజీటీని ఆసీస్కు కోల్పోయింది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో చూడాలి.
వన్డేల్లో కోహ్లీ, రోహిత్ లపై వేటేస్తారా..?
ఇక వచ్చేనెలలో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇది వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. అంతకుముందు ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను వచ్చే నెల 6 నుంచి జరుగుతుంది. అయితే వన్డేల్లో ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలను కొనసాగిస్తారో లేదో చూడాలి. కోహ్లీ, రోహిత్ ద్వయం గతేడాది కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడారు. ఈ ఫార్మాట్లో అత్యద్భుత రికార్డులు వీరి సొంతం. టెస్టుల్లో ప్రదర్శనను బట్టి, వన్డేల్లో వీరిపై వేటు వేయక పోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వీరికి మరో చాన్స్ లభించవచ్చని పేర్కొంటున్నారు. దీనిపై కూడా గంభీర్, అగార్కర్ లతో బోర్డు వర్గాలు చర్చించే అవకాశముంది. అలాగే గంభీర పదవిని చేపట్టి చాలాకాలమే అయింది. అతని ప్రదర్శనపై కూడా రివ్యూ జరుగనుందని బోర్డు వర్గాలు పేర్కొంటు న్నాయి.
ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీలకు జట్ల ఎంపిక..
ఇక ఇంగ్లాండ్ తో భారత్ ఈనెల 22 నుంచి ఐదు టీ20ల సిరీస్, వచ్చనెలలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లకు జట్లను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే అందుకోసం గంభీర్, అగార్కర్లతో బోర్డు వర్గాలు చర్చించనున్నాయి. ఆసీస్ టూర్లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లకు ఒక ఫార్మాట్లో చోటు దక్కవచ్చు. అలాగే ఈ ఏడాదికి సంబంధించిన ప్రణాళిలకపైనా చర్చలు జరిగే అవకాశముంది. మరోవైపు ఆదివారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇందులో బోర్డు తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియాకు పూర్తిస్థాయి కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఏదేమైనా పలు విషయాలపై శనివారం జరిగే మీటింగ్ లో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా ఈ మీటింగ్ ఔట్ కమ్ ఏంటోనని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.




















