Godavari Pushkaralu Dates: దక్షిణ భారత కుంభమేళా’గా గోదావరి పుష్కరాలు, 2027 పుష్కరాల కోసం శాశ్వత ఘాట్లు, పుష్కరాల డేట్స్ ఇవే!
Godavari Pushkaralu Dates 2027: గోదావరి పుష్కరాలకు ఇంకా దాదాపు 22 నెలల సమయం ఉంది...కానీ ఇప్పటి నుంచే ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం...

Godavari Pushkaralu Starting and Ending Dates : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకుని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
2027లో జులై 23 నుంచి గోదావరి పుష్కరాలు 12 రోజుల పాటూ జరుగుతాయి. ఇంకా 22 నెలల టైమ్ ఉన్నప్పటికీ శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ..అందుకే ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని , ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ మేరకు రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో, అవసరమైన వసతి సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి..అక్కడ ఏం అభివృద్ధి చేయాలో జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. మహా కుంభమేళా సహా ప్రధాన పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల రూపకల్పనలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం సహా గోదావరి తీరం వెంట ఉన్న అన్ని ఆలయాలన్నింటినీ సందర్శించి ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ తో పాటూ అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించాలన్నారు. వాటికి అవసరం అయిన అనుమతులు ముందస్తుగా తీసుకోవాలని సూచించారు.
దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజ్ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితా సిద్ధం చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.






















