Medaram Jatara: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..
దట్టమైన అడవిలో దాగిన ఓ చారిత్రక నమ్మకం, అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం, వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే ప్రవాహం, కోటి గొంతుకలకు నాలుగు రోజుల సంబురమైన మేడారం జాతరపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..

మేడారం గ్రామంలో ఉన్న రెండు గద్దెలకు ఉన్న మహత్యం చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ రెండు గద్దెలను దర్శించుకోవడానికి కోట్లాది భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మేడారం చేరుకుంటారు. అమ్మల ఆగమనం మొదలు మొక్కుబడులు చెల్లించుకునే వరకు ప్రతీ ఒక్కరిలోనూ ఓ ఆకాంక్ష...అమ్మను చూడాలి.. మొక్కాలి ఆతర్వాత మొక్కులు చెల్లించాలి. కనుచూపు మేరలో నేల కనిపించని ఈ జనసంద్రం మరో కుంభమేళాను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. 13వ శతాబ్దాంలో కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడి ప్రతాపానికి ఎదురొడ్డి నిలిచిన వీరవనితలు సమ్మక్క సారక్కలు. ఆ మగువల తెగువను మనసారా తలుచుకోవడానికి ఆతల్లుల త్యాగనిరతికి తలవంచి ప్రణామాలు చేయడానికే ఈ జాతర.
మేడారానికి సంబంధించి ప్రచారంలో ఉన్న గాథ
మేడారం సామ్రాజ్యాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్ధ రాజు పాలించేవాడు. ఆయన సతీమణి సమ్మక్క. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని ఎలగందులను పాలించిన మేడరాజుకు పగిడిద్ద మేనల్లుడు. సామంతులైన కోయలు ఏటా కాకతీయులకు కప్పం కట్టాల్సిందే... అయితే ఆసంవత్సరం మేడారం ప్రాంగణంలో పచ్చగడ్డి కూడా మొలవలేదు. ఈ దుర్బర పరిస్థితిలో కోయలు కప్పమెలా కట్టాలని బాధపడుతూ పగిడిద్దరాజు కాకతీయ చక్రవర్తికి పరిస్థితి వివరించాడు. అయినప్పటికీ కప్పం కట్టాల్సిందేనని లేకుంటే యుద్ధానికి సిద్ధం కావాలని గడువు విధించాడు. గడువు దాటి పోవడంతో కాకతీయ సేన మేడారం పైకి దండెత్తింది. స్వయం పాలన కోసం జరిగిన ఈ పోరు పగిడిద్దరాజు నేత్రుత్వంలో సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు ప్రతాప రుద్రుడి సైన్యాన్ని సంపెంగ వాగు వద్ద నిలువరించారు.
పాలకుల అహంకారానికి, గిరిజనుల ఆత్మాభిమానానికి భీకరమైన పోరాటం జరిగింది. పగిడిద్దరాజు ప్రాణాలు కోల్పోయాడు, నాగులమ్మ నేల కూలింది. సారలమ్మ వీరమరణం పొందింది. గోవిందరాజులు తలవాల్చాడు. ఘోరాన్ని చూడలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకాడు. దీంతో సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది. తన వారి మరణవార్త విన్న సమ్మక్క భగ భగ మండి పోయింది. కాకతీయ సేనపై దండెత్తింది. సమ్మక్కను కాకతీయ సేన వెనుక నుంచి పొడిచి దొంగ దెబ్బతీశారు. నెత్తురోడిన సమ్మక్క మేడారానికి ఈశాన్యం వైపున ఉన్న చిలుకల గుట్టపైకి వెళ్లి అదృశ్యమైంది. కోయలు గుట్ట ప్రాంతమంతా వెతక్కా ఓ కుంకుమ భరిణె దొరికింది. ఆ స్థలమే వీరభోజ్యమని చెబుతూ రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవాలు జరుపాలన్న అదృశ్యవాణి మాటలతో ప్రతాప రుద్రునిలో మార్పు వచ్చింది. సమ్మక్క సారలమ్మలకు భక్తితో జాతర జరిపించాడు.
రాజులు పోయినా రాజ్యాలు పోయినా సమ్మక్క సారలమ్మలు వనదేవతలై పూజలందుకుంటున్నారు. ఈ గాథ చరిత్రాత్మకంగా కొంత దగ్గరగా ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలేవి లేవు. మరో పది కథలు సమ్మక్క జారతకు సంబంధించి ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ గాథనే ప్రామాణికంగా తీసుకుంటూ కోయలు జాతర జరుపుకుంటున్నారు.
Before You Go
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















