Ksheerabdhi Dwadashi Vrat Katha: క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ ఇదే!
Ksheerabdhi Dwadashi 2025: నవంబర్ 2 ఆదివారం క్షీరాబ్ధి ద్వాదశి. ఈ రోజు సాయంత్రం తులసిమొక్క దగ్గర దీపాలు వెలిగించి పూజ పూర్తయ్యాక తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ ఇదే!

Ksheerabdhi Dwadashi Vrat Katha In Telugu
తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః
యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ
విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే
కౌరవులతో జూదంలో ఓడిపోయి పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు ఐదుగురు సోదరులు. అప్పుడు ఇలా అడిగారు.. మనుషుల ధర్మబద్ధమైన కోర్కెలన్నీ ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి మహర్షీ?
అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు..వాటిలో మొదటిది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేస్తున్న క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం. కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజున క్షీరాబ్ధి ద్వాదశివ్రతం ఆచరిస్తారని చెప్పి..ఆ వ్రతం విశిష్టతను ఇలా వివరించారు
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు.. కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్రనుంచి మేల్కొంటాడు. ఈ రోజు చాతుర్మాస్యం ముగుస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా, దేవతలు మునుల సమేతంగా బృందావనంలో కొలువుతీరుతాడు. అందుకే క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాస మహర్షి..పాండవులకు వివరించారు..వ్రత విధానం కూడా చెప్పారు.
దేవ ఉత్థాన ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి.. క్షీరాబ్ధి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసికోట దగ్గర శుభ్రంచేసి ముగ్గు పెట్టి, అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను/కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువు విగ్రహం/ ఫొటోను ఉంచి భక్తితో షోడసోపచార పూజ పూర్తిచేసి సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఉసిరిపై దీపాలు వెలిగించి..తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యం, దీపదాన ఫలం విన్న తర్వాత బ్రాహ్మణులకు శక్తికొలది తాంబూలం సమర్పించుకోవాలి.
దీపదాన ఫలితం గురించి పాండవులకు వ్యాసమహర్షి ఇలా చెప్పారు
కార్తీకమాసంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి రోజు బృందావనం/తులసికోట దగ్గర దీపదానం చేయాలి
ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి
భక్తితో ఓ వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు
నాలుగు వత్తులు వేస్తే రాజవుతారు
పది వత్తులు విష్ణుసాయుజ్యం పొందుతారు
వేయివత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది
దానం చేసే దీపంలో ఆవునేయి వేయాలి
నువ్వులనూనె పర్వాలేదు
ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో ఆవునేయి వేస్తే దోషం ఉండదు
ఇప్పనూనె భోగాన్నిస్తుంది
ఆవనూనె కోర్కెలు తీరుస్తుంది
అవిసెనూనె శత్రువులను తగ్గిస్తుంది
ఆముదం ఆయుష్షు నాశనం చేస్తుంది
బర్రె నేయి గతంలో చేసిన పుణ్యాన్ని తొలగించేస్తుంది
అందుకే ఆవునేయి, నువ్వులనూనె వేసిన దీపాన్ని దానం చేయడం శ్రేష్ఠం అని చెప్పారు వ్యాసమహర్షి.
వ్యాసమహర్షి చెప్పిన తులసి మహత్యం కథ
కార్తీకమాసంలో తులసిపూజ ఆచరించేవారు ఉత్తమలోకాలను పొందుతారు. ఉత్థాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చంఢాలురుగా జన్మిస్తారు. తులసిమొక్కను ఇంట్లో పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయో..అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు. తులసీదళం కలసిన నీటితో స్నానం ఆచరించేవారి పాపాలు తొలగిపోతాయి. తులసి మొక్క ఉన్నచోట అకాల మృత్యులు దరిచేరదు. పూర్వకాలంలో కాశ్మీరదేశంలో హరిమేధ ,సుమేద అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ మార్గ మధ్యలో ఓ చోట తులసితోట చూశారు. వెంటనే సుమేధుడు చేతులు జోడించి ప్రదక్షిణ చేశాడు. అది చూసిన హరిమేథుడు ఎందుకు అని అడిగితే.. ఇలా చెప్పాడు సుమేధుడు. దేవతలు - రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించిన ఎన్నో పుణ్యవస్తువుల్లో తులసి ఒకటి. తులసి అంటే శ్రీమహావిష్ణువుకి చాలా ప్రత్యేకం, ప్రీతికరం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిని నమస్కరించినట్టే అని వివరించాడు సుమేధుడు.ఈ కథ ఇలా చెప్పడం పూర్తైందో లేదో వెంటనే సుమేధుడు-హరిమేథుడు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారమని..అప్సరసతో భోగంలో ఉంటూ రోమశమహాముని తపస్సుకు భంగం కలిగించాం.. అందుకే శాప ఫలితంగా ఈ చెట్టుతొర్రలో రాక్షసులుగా ఉన్నాం...తులసి కథ విన్నాక శాప విమోచనం అయిందని చెపి దేవలోకానికి వెళ్లిపోయారు.
క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఈ కథ చదివినా, విన్నా సర్వపాపాలు నశిస్తాయని పాండవులకు వివరించారు వ్యాసమహర్షి...
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















