Bhagavad Gita: బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!
UNESCO Honors Bhagavad Gita: కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు భగవద్గీత చదివితే ఉపశమనం లభిస్తుందని ఎందుకు చెబుతారు? భగవద్గీతలో ఏముంది?

Why You Should Read The Bhagavad Gita
ఎవరైనా ఏదైనా విషయం గురించి తీవ్రమైన ఆలోచనలో ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు ఓ చిన్నమాట చాలు స్వాంతన చేకూరుతుంది
ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి చాలు.. మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది
సమస్యలు, బాధలు లేని మనిషి అనేవాడు భూమ్మీద ఉంటాడా అసలు?
అందుకే సమస్య రాకూడదు అనుకోకూడదు..వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి
అదెలా అనేది నేర్పించేది..వేలుపట్టి నడిపించేదే భగవద్గీత..అందుకే బాధలో ఉన్నప్పుడు భగవద్గీత చదవాలి అని చెబుతారు
శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి...రాజ్యం కోసం వీరిని వధించాలా అనే బాధతో యుద్ధరంగం నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఆ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానమే భగవద్గీత. ఇది మతగ్రంధం కాదు..మనిషి ఎలా బతకాలో సూచించే గ్రంధం. ఇందులో శ్లోకాలు అన్నీ చదివినా లేకున్నా కొన్నిటి శారాంసం తెలుసున్నా చాలు..
శ్లోకం
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః||
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించటం అనుచితం. వివేకవంతులు అనిత్యములైన శరీరం గురించి కానీ , శాశ్వతం అయిన ఆత్మ గురించి కానీ దుఃఖించరాదు.
శ్లోకం
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||
శరీరానికి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలానో జీవుడికి మరో దేహం పొందడం కూడా అంతే. అందుకే ఈ విషయంపై ధీరులు మోహం పెంచుకోరు
శ్లోకం
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా- న్యన్యాని సంయాతి నవాని దేహీ
చినిగిన వస్త్రాలు విడిచి నూతన వస్త్రాలు ఎలా వేసుకుంటారో ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది
శ్లోకం
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః||
ఆత్మకు నాశనం లేదు, ఆత్మను ఎంత పదునైన శస్త్రాలు కూడా చేధించలేవు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, గాలి నిలువరించలేదు...అందుకే ఆత్మకు నాశనం లేదు
శ్లోకం
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి||
జన్మించిన వారికి మరణం తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
శ్లోకం
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి||
కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం ఉందికానీ కర్మ ఫలితముపై లేదు. నీవు కర్మఫలమునకు కారణం కాకూడదు .అలా అని కర్మలను చేయుట మానరాదు.
శ్లోకం
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే||
దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడ... రాగం, భయం , క్రోధం లేనివారినే స్థితప్రజ్ఞుడు అంటారు
శ్లోకం
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే||
విషయవాంఛల గురించి నిత్యం మననం చేసేవారికి రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధంగా మాపుతుంది. క్రోధం వల్ల అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితంగా బుద్ధిని కోల్పోయి అధోగతి చెందుతారు
శ్లోకం
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి||
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుసారం బ్రహ్మప్రాప్తిసాధనం కలిగిన జీవుడు సంసారంలో పడకుండా సుఖ స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.






















