Cult TDP vs New TDP: టీడీపీలో అసంతృప్తి సెగలు: కొత్త నీరు, పాత నేతల మధ్య 'సోల్' మిస్సింగ్? కార్యకర్తల్లో ఆవేదన!
Cult TDP vs New TDP: తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగానే ఉందా.. ? పార్టీలో కొత్త నీరు లేని సమస్యలు తెస్తోందా.. ? బయటి వ్యక్తుల ‘పెత్తనం’ తో టీడీపీ ‘సోల్’ దెబ్బతింటోందా..?

Telugu Desam Party: తెలుగుదేశం తన చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో అత్యధిక సీట్లను సాధించి ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యర్థి వైకాపాను నేలకరిపించడమే కాదు.. కేంద్రంలోనూ అనుకూల వాతావరణం రావడంతో ఆ పార్టీ ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్గా ఉంది. కానీ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడో ఆవేదన.. సీనియర్లలో ఎందుకో అసంతృప్తి. ఆత్మగౌరవ నినాదానికి ప్రతిరూపమైన తెలుగుదేశం సోల్.. దెబ్బతింటోందా.. అన్న ఆలోచన కల్ట్ తెలుగుదేశం అభిమానుల్లో కలుగుతోంది.
తెలుగుదేశం… అత్యంత విజయవంతమైన, దేశంలోని అతిపెద్ద రీజనల్ పార్టీ. 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన తెలుగుదేశానికి కార్యకర్తలే అసలైన బలం. సైద్ధాంతిక పునాదులతో నిర్మితమైన ఆ పార్టీ కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సతమతమవుతోందా అనిపిస్తోంది. కొత్త లీడర్ల ప్రవేశం.. ఇతర పార్టీ నేతల సాంగత్యం.. నేతల్లో తగ్గిపోతున్న ఎమోషన్.. ఇవన్నీ కార్యకర్తలకు కాస్త కష్టం కలిగిస్తున్నట్లుగానే ఉంది. పార్టీలోనే కొందరి సీనియర్ నేతల సణుగుళ్లు కూడా అందుకు నిదర్శనమే..!
తెలుగుదేశం అనేది బలమైన భావోద్వేగాలతో నిర్మితమైన ప్రాంతీయ పార్టీ.. కార్యకర్తల్లో ఉద్వేగం.. అంకిత భావం ఎక్కువ. వ్యక్తుల కంటే పార్టీ ఎక్కువ అనే ఫీలింగ్ ఆ పార్టీకి ఇంధనం. అందుకే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుంది. నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా నిలబడగలిగింది. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులు పార్టీ కట్టును తప్పిస్తున్నాయా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా బయటపార్టీల నుంచి తీసుకున్న నాయకుల వల్లనైతేనేమీ.. తెలుగుదేశంలో పైస్థాయి నాయకత్వం నుంచీ కిందిస్థాయి వరకూ కాలక్రమేణా జరిగిన నాయకత్వ మార్పుల వల్లనైతే నేమీ ఒకప్పటి గాఢత తగ్గిందనేది వాస్తవం.
కొత్త నాయకత్వంతో సమస్యలు
కోర్ తెలుగుదేశానికి అధికారంలో భాగస్వామ్యం దక్కడం లేదనడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ మంత్రివర్గ కూర్పే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మినహా.. 24మంది మంత్రులు ఉన్నారు. వీరిలో మిత్రపక్షాలకు చెందిన నలుగురూ కొత్తమంత్రులే. వారని మినహాయిస్తే.. మిగిలిన 20మంది మంత్రుల్లో పాతవారు కేవలం ఆరుగురు. అంటే మిగిలిన 14మంది కొత్తవారే. ఇందులో ఇతర పార్టీల్లోకి వెళ్లొచ్చిన వాళ్లు.. యాక్టివ్గా లేని వాళ్లు ఉండటం తెలుగుదేశం కార్యకర్తలకు అప్పుడే నచ్చలేదు. కొత్త నాయకత్వం పేరుతో పార్టీ DNAను ఏమాత్రం అర్థం చేసుకోని వారికి అప్పగించారనే విమర్ళలున్నాయి. ఇక కొంతమంది మంత్రులు “ఏ కోటాలో” మంత్రి పదవి దక్కించుకున్నారో తెలీదు కానీ .. అసలు వాళ్లకి పార్టీతో కిందిస్థాయిలో కనెక్షన్ లేదు.
పార్టీని కాపాడటానికో.. లేక ఆర్థిక పరిపుష్టి కలిగించడానికో.. లేక ప్రత్యర్థి పార్టీని బలహీనపరచాలన్న లక్ష్యంతోనో కొన్ని నిర్ణయాలు జరిగాయి. వీటివల్ల తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు పక్కకు తప్పుకోవలసి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాము గెలిచినా కూడా కొంతమంది పార్టీ నేతలు ‘త్యాగం’ చేయాల్సి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో పొత్తుల వల్ల అడ్జెస్ట్మెంట్లు, బయట నుంచి తీసుకున్న వారి వల్ల కలిగిన ఇబ్బందులు ఇలా అనేక రూపాల్లో కొన్నాళ్లుగా ప్రతిస్పందనలు వస్తూనే ఉన్నాయి.
సీనియర్ల చిటపటలు:
తెలుగుదేశంలో పార్టీని ఓన్ చేసుకుని … పార్టీ లైన్పై చాలా కచ్చితంగా ఉండే నేతలు కొంతమంది ఉన్నారు. అయ్యన్నపాత్రుడు పార్టీ అధికారంలో లేనప్పుడు.. తన వాయిస్ను బలంగా వినిపించారు. ఇతర పార్టీల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని అంతగా ఇష్టపడరు. ఈ మధ్య ఆయన కుమారుడు కూడా నేరుగా ఇలాగే మాట్లాడారు. “వైసీపీ వాళ్లకి వంగి దండాలు పెట్టాల్సిన ఖర్మ లేదన్నారు..” టీడీపీలో మరో నేత చింతమనేని ప్రభాకర్ ఫైర్బ్రాండ్. పార్టీ లైన్ విషయంలో పక్కాగా ఉంటారు. ఆయనకు కూడా ఏలూరు జిల్లాలో సమస్యలు వచ్చాయి. మంత్రి పార్థసారథి కొంతమంది వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చిరాకుపడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్న వాళ్లలో ఇప్పటికీ కొనసాగుతున్న వారిలో అయ్యన్న, బుచ్చయ్య చౌదరి ఉన్నారు. వయసు మీద పడుతున్నా తనకు మంత్రి పదవి రాకపోవడంపై బుచ్చుయ్య చాలా సార్లు ఆవేదన చెంది.. ఇక తనకు రాదని డిసైడై పార్టీలో స్తబ్ధుగా ఉంటున్నారు. అయితే ఆయన కూడా ఈమధ్య కొంతమంది “జూనియర్లు” తనకే సలహాలు ఇస్తున్నారంటూ చిటపటలాడారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్న మరో నేత యనమల కూడా సైడ్లైన్ అయిపోయారు. ఆయన కూడా అప్పడప్పుడూ కనిపించీ.. కనిపించనట్లు అసంతృప్తి బయటపెడుతూనే ఉంటారు
డిఫెన్స్ లోకి రాని సీనియర్లు..
తెలుగుదేశం అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఆ పార్టీ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్, ఎర్రన్నాయుడు, యనమల, అయ్యన్న వంటి సీనియర్లు పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు. 2004-14 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. పయ్యావుల, ధూళిపాళ్ల, దేవినేని రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీకి స్ట్రెకింగ్ ఫోర్సుగా ఉండేవారు. కానీ 2014 నుంచే పార్టీ ఫంక్షనింగ్లో చాలా మార్పులు వచ్చాయి. సీనియర్లు పార్టీని డిఫెండ్ చేయడం మానేశారు. మంత్రి పదవి రావడం లేదన్న అసంతృప్తి వల్ల ధూళిపాళ్ల రాష్ట్ర కార్యాలయానికి రావడమే మానేశారు. తనను పక్కన పెట్టారని దేవినేని కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఏదైనా విమర్శ వస్తే.. ఇప్పుడు పార్టీ తరపున మాట్లాడటానికి వంగలపూడి అనిత తప్ప ఎవరూ లేరు. ఇంకా ఎంత దైన్యస్థితి అంటే ఏదైనా మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలపై ఆరోపణలు వస్తే.. అన్నింటికీ చంద్రబాబో.. లోకేషో ఆన్సర్ చేసుకోవాలి తప్పితే.. ఆ మంత్రుల జాడ ఉండదు.
కార్యకర్తలకు సంకటం
ఇలాంటి పరిణామాలతో పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. లీడర్ల కన్నా పార్టీనే నమ్మే కార్యకర్తలు తెలుగుదేశంలో ఎక్కువుగానే ఉంటారు. అలా పార్టీతో మమేకం అయిన స్థానిక నాయకత్వంతో వాళ్లు కలవగలుగుతారు కానీ.. Mixed కల్చర్ వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇంక కొన్ని చోట్ల అయితే పార్టీని పూర్తిగా గాలికొదిలేసి సంపాదించడమే టార్గెట్ గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందుకోసం అప్పటికే వాటిలో పాతుకుపోయిన వైసీపీ వాళ్లలో సెటిల్ చేసుకున్న చెట్టాపట్టాలు వేసుకోవడం టీడీపీ హార్డ్కోర్కు మింగుడు పడటం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఓ పాత నాయకుడిని కదిలిస్తే…” ఇవన్నీ చిన్న సార్కు.. పెద్దసార్కు తెలీకుండానే జరుగుతున్నాయా..”?అన్నారు.
ఏ పార్టీలో అయినా కొత్త నాయకత్వం రాక తప్పదు. అది బయట నుంచైనా రావొచ్చు.. లేక అంతర్గతంగానే మారొచ్చు. కానీ ఆ మార్పు అనేది పార్టీ ఆత్మను దెబ్బతీయకూడదు. ముఖ్యంగా ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన తెలుగుదేశంలో..!





















