Tamilnadu Politics: ప్రజాకర్షక నేత లేకపోయినా పవర్ తగ్గని అన్నాడీఎంకే - జయలలిత మ్యాజిక్ ఇంకా పని చేస్తోందా?
AIADMK: తమిళనాడు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత శకం ముగిసినా, అన్నాడీఎంకే తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ప్రజాకర్షకనేత లేకపోయినా ఎలా నిలబడుతోంది?

Tamilnadu Politics Stron AIADMK: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు డీఎంకేకు పోటీ ఇస్తోంది అన్నాడీఎంకేనే. విజయ్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే డీఎంకేకు స్టాలిన్, టీవీకేకు విజయ్ ప్రజాకర్షక నేతలున్నారు. అన్నాడీఎంకేకు లేకపోయినా ఆ పార్టీ గట్టి పోరాటం చేస్తోంది. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి తమిళనాడులో అత్యంత పటిష్టమైన గ్రామస్థాయి యంత్రాంగం ఉంది. ఏ నాయకుడు ఉన్నా లేకపోయినా, బూత్ స్థాయి వరకు విస్తరించిన పార్టీ క్యాడర్ రెండు ఆకుల గుర్తుకు విధేయంగా ఉండటం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడు పార్టీకి ఉన్న తిరుగులేని ఓటు బ్యాంక్ జయలలిత మరణం తర్వాత కూడా చెక్కుచెదరలేదు.
పళనిస్వామి హవా - ఏకఛత్రాధిపత్యం
జయలలిత మరణం తర్వాత పార్టీలో తలెత్తిన వారసత్వ పోరును ఎడప్పాడి కె. పళనిస్వామి అత్యంత నేర్పుగా పరిష్కరించారు. ఓ. పన్నీర్సెల్వం , టీటీవీ దినకరన్ వంటి ప్రత్యర్థులను పక్కనపెట్టి, పార్టీపై పూర్తి నియంత్రణ సాధించారు. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎన్డీయే కూటమి తరపున 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఖరారయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వంటి వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
సంక్షేమ పథకాల వారసత్వం - అమ్మ బ్రాండ్
అమ్మ క్యాంటీన్, అమ్మ సిమెంట్ వంటి సంక్షేమ పథకాలు సామాన్యుల మనస్సుల్లో అన్నాడీఎంకే పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగించాయి. తాము అధికారంలోకి వస్తే అమ్మ ఇల్లం పథకం కింద ఉచిత ఇళ్లు, మహిళలకు ప్రతి నెలా 2,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఈపాటికే పళనిస్వామి ప్రకటించారు. డీఎంకే ఇచ్చే దానికంటే రెట్టింపు ఇస్తామని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 2026 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే భారీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే, పీఎంకే , ఏఎంఎంకే వంటి పార్టీలతో పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమి 210 స్థానాల్లో విజయం సాధిస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీని కేవలం సినిమాలకే పరిమితమైన సూపర్స్టార్గా కొట్టిపారేస్తూ, అసలైన పోరు అన్నాడీఎం, డీఎంకే మధ్యనే ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.
పళనీస్వామికి అంత తేలిక కాదు !
జయలలిత ఉన్నప్పుడు ఉన్నంత ఛరిష్మా ప్రస్తుత నాయకత్వంలో లేకపోయినా, పాలనాపరమైన అనుభవం , క్షేత్రస్థాయి పట్టు పళనిస్వామికి ప్లస్ పాయింట్లుగా మారాయి. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన విజయవంతమవుతున్నారు. అయినప్పటికీ, అంతర్గతంగా అక్కడక్కడా వినిపించే అసంతృప్త స్వరాలను అణచివేసి, కూటమిలో సీట్ల సర్దుబాటును విజయవంతంగా ముగిస్తేనే 2026లో అధికారం దక్కుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.























