Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Samrat Chaudhary: రెండు దశాబ్దాల పాటు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపడతారు.

Samrat Chaudhary to be next CM of Bihar: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. సుమారు రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను కలిసిన నితీష్, తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజ్యసభకు ఎన్నికైనందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీహార్లో సుమారు 20 ఏళ్ల పాటు సాగిన నితీష్ కుమార్ పాలన ముగింపుకు వచ్చింది. ఆయన తన కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే రాజీనామా చేశారు.
నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని తమ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండా బీజేపీ తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకోవడం ఇదే మొదటిసారి .
నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ప్రధాన మలుపు. 2005 నుండి వరుసగా 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించిన నితీష్, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. గత వారం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, రాష్ట్ర బాధ్యతల నుండి తప్పుకోవడం అనివార్యమైంది. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మార్పులు జరిగాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏప్రిల్ 15, బుధవారం ఉదయం 11 గంటలకు పాట్నాలో జరగనుంది. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. సామ్రాట్ చౌదరి కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో, బీహార్లోని సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఆయనతో పాటు జేడీయూ కోటాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వారిలో ఒకరు నితీష్ కుమారుడు ఉండనున్నారు.
पटना एयरपोर्ट पर भाजपा के यशस्वी राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी और माननीय केंद्रीय मंत्री श्री @ChouhanShivraj जी का अंगवस्त्र भेंटकर हार्दिक स्वागत-अभिनंदन किया।#Bihar #patna #NDA4Bihar pic.twitter.com/RMntUO5zAw
— Samrat Choudhary (@samrat4bjp) April 14, 2026
ఈ రాజకీయ పరిణామాలతో బీహార్లో ఎన్డీఏ కూటమి తన పట్టును మరింత బిగించింది. నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లడం, సామ్రాట్ చౌదరి రాష్ట్ర పగ్గాలు చేపట్టడం వల్ల పరిపాలనలో కొత్త వేగం వస్తుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే, సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ లేని లోటును జేడీయూ ఎలా భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, సామ్రాట్ చౌదరి పట్టాభిషేకంతో బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















