Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పండి- మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Encounter | కేంద్ర ప్రభుత్వం, సిపిఐ మావోయిస్టు పార్టీకి మధ్య కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ లేఖ రాసింది.

ceasefire between Union Govt and CPI Maoist Party | గత కొంతకాలం నుంచి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఎందరో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇకనైనా కాల్పుల విరమణ, శాంతి చర్చలు చేపడితే మంచిదని శాంతి చర్చల కమిటీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వము, కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా - మావోయిస్టు పార్టి [CPI - Maoist Party] మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాసింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత పేర్కొంటూ పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్ర కుమార్ ఆదివారం నాడు ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
శాంతి చర్చల కమిటీ రాసిన లేఖలో ఏముందంటే..
‘ మేము పీస్ డైలాగ్ కమిటీ బాధ్యులము. ఈ కమిటీ పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. సిపిఐ - (మావోయిస్టు) పార్టీ, కేంద్ర ప్రభుత్వము మధ్యన కాల్పుల విరమణ - శాంతి చర్చల స్థాపన కోసం ఏర్పాటు అయింది పీస్ డైలాగ్ కమిటీ. ఇరు పక్షాల మధ్య శాంతియుత చర్చలను సులభతరం చేయడంకోసం, కాల్పుల విరమణను ప్రోత్సహించడం, హింసను అంతం చేయడానికి స్థిరమైన పరిష్కారాలను కనుక్కోవడం, ఇరు పక్షాలకు సూచనలు చేయటం కమిటీ ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీలో సమాజంలోని వివిధ వర్గాల నుండి న్యాయ కోవిదులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు , మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, ప్రజా నాయకులు భాగస్వాములుగా ఉన్నారు.
మధ్య భారతదేశములో మావోయిస్టు పార్టీ సాయుధులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధులకు మధ్య జరుగుతున్న హింసా విధానాలకు సామాన్య ప్రజలు, ఆదివాసీలు జీవించే హక్కును కోల్పోతున్నారు. నిత్యం ఆయా ప్రాంతాలలో నెత్తుటి మధ్యలోనే ప్రజలు జీవిస్తున్నారు అని పత్రికలలో వస్తున్న వార్తలు చూసి మేము కలవరపడుతున్నాం. ఇద్దరి హింసా విధానాల ఫలితముగా మహిళలు, పిల్లలు, యువత భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాలు, గూడేలు వదిలి తరలివెళుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజ్యంగములో చెప్పిన విధంగా సంక్షేమ రాజ్యము ఏర్పాటు చేయుటకు సరియైన, తగినటువంటి వాతావరణం రోజురోజుకూ సమాజంలో క్షిణిస్తోందని ఆందోళన చెందుతున్నాము.
మావోయిస్టు పార్టీ గెరిల్లాలు, ప్రభుత్వ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణను నివారించడానికి కాల్పుల విరమణ - శాంతి చర్చలు ఒక్కటే మార్గం అని ప్రజాస్వామిక వాదులముగా భావిస్తున్నాము. ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ సాయుధ సంఘర్షణ దేశంలోని అనేక ప్రాంతాలలో అశాంతి, మరియు ప్రాణనష్టానికి కారణమవుతోంది. మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు తల్లి తండ్రులను కోల్పోతున్నారు, గిరిజన సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పెద్దఎత్తున మానవ హక్కులకు విఘూతము కలుగుతున్నది, ఈ హింసా విధానాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తూ, అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది.
ఈ పరిస్థితుల దృష్ట్యా, భారత రాజ్యాంగం కల్పిస్తున్న సంక్షేమ రాజ్య స్థాపన కోసం మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని, దేశంలో రగులుతున్న హింసను, వాటి పరిణామాలను, పరిస్థితులను చక్కపెట్టాలని కోరుతున్నాం. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు పూనుకునే విధంగా, ఇరు పక్షాలు శాంతి చర్చల వైపు ప్రయాణించే వాతావరణాన్ని కల్పించుటకోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం మీ జోక్యం తక్షణావసరం ఉందని మీరు భావించాలి. దీనికి మీరు సానుకూలముగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’ అని పీస్ డైలాగ్ కమిటీ లేఖలో పేర్కొంది.
పీస్ డైలాగ్ కమిటీ
జస్టిస్ చంద్ర కుమార్ (అధ్యక్షుడు)
K. ప్రతాప్ రెడ్డి
బాల కిషన్ రావు
జయ వింద్యాల
ప్రో వినాయక్ రెడ్డి
ప్రో అన్వర్ ఖాన్
ప్రో హరగోపాల్
జంపన్న
సోమ రామమూర్తి
అజయ్ బాల్నే
దుర్గా ప్రసాద్
డా. తిరుపతి
రహమాన్ జనం సాక్షి
అత్రం భుజంగరావు
వెంకన్న అడ్వకేట్
చెరుకు సుధాకర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

