Petro rates: పెట్రోలు ధరల పెంపు లేదంటున్న కేంద్రం - ఏప్రిల్ 29 తర్వాత పెంచకుండా ఉండగలరా?
petrol prices: పెట్రోల్, డీజీల్ ధరలు పెంచబోమని కేంద్రం చెబుతోంది. కానీ బెంగాల్ చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత పెంచకుండా ఉండగలరా?

petrol prices after April 29 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా క్రూడాయిల్ గ్రాఫ్ నిటారుగా పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 24, 2026 నాటి గణాంకాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 106 డాలర్ల మార్కును దాటింది. మార్చి నెలలో కేవలం 77 డాలర్ల వద్ద ఉన్న ధర, కేవలం నెల రోజుల వ్యవధిలోనే 35 శాతం పైగా పెరగింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవ్వడం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధి వద్ద అనిశ్చితి నెలకొనడం వల్ల ముడిచమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద సవాల్గా మారాయి.
ఎన్నికల కోడ్ - స్తంభించిన ధరలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు వంద డాలర్లు దాటినా, దేశీయంగా ఇంధన ధరలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉండటం వెనుక రాజకీయ వ్యూహం ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న ముగియనుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో చమురు సంస్థలు ధరలను పెంచకుండా నిలిపివేయడం, పోలింగ్ ముగిసిన వెంటనే సర్దుబాటు పేరుతో ఒకేసారి భారం మోపడం గతంలోనూ పలుమార్లు జరిగింది. ఈసారి కూడా మే మొదటి వారంలో భారీ మార్పులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చమురు సంస్థల భారీ నష్టాలు
ప్రస్తుతం దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఈ సంస్థలు లీటర్ పెట్రోల్పై 20, డీజిల్పై సుమారు 100 వరకు అండర్-రికవరీ భరిస్తున్నాయి. ముడిచమురు ధరలు 120 డాలర్లకు చేరితే, ఈ నష్టాలను పూడ్చుకోవడానికి దేశీయంగా పెట్రోల్ ధరలను లీటరుకు 25 నుండి 28 వరకుపెంచాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. చమురు సంస్థలు ప్రతి నెలా దాదాపు 27,000 కోట్ల అదనపు భారాన్ని మోస్తున్న తరుణంలో, ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించకుండా ఉండటం అసాధ్యమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ప్రభుత్వ ఖండన - భరోసా వెనుక అసలు నిజం?
పెట్రో ధరల పెంపుపై వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొన్ని వర్గాలు చేస్తున్న తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఎటువంటి ధరల పెంపు ప్రతిపాదన లేదని స్పష్టం చేస్తూ, ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే, మార్కెట్ పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి భారాన్ని తనపై వేసుకుంటుందా లేక ధరల పెంపుకే మొగ్గు చూపుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
యుద్ధం ఆగిపోతేనే ఊరట?
ప్రస్తుతానికి సామాన్యుడికి ఉన్న ఏకైక ఆశ.. పశ్చిమాసియా నెలకొన్న యుద్ధ వాతావరణం సద్దుమణగడమే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా యధావిధిగా జరిగితేనే క్రూడాయిల్ ధరలు మళ్లీ 80 డాలర్ల స్థాయికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడే ధరల పెంపు ముప్పు తప్పుతుంది. లేనిపక్షంలో, ఏప్రిల్ 29 తర్వాత చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను వేగవంతం చేసి, వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టడం దాదాపు ఖాయమనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















