![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kodi Katti Case: కోడికత్తి శీను తల్లి దీక్ష భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రికి తరలింపు
AP Latest News: కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా అమరణ దీక్షకు దిగిన సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
![Kodi Katti Case: కోడికత్తి శీను తల్లి దీక్ష భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రికి తరలింపు AP News Kodi kathi Seenu mother hunger strike disrupted by ap police Kodi Katti Case: కోడికత్తి శీను తల్లి దీక్ష భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రికి తరలింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/380b7720e9597a42df0ea53cb180d3401690894690365233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kodi Kathi Case Latest News: కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ (Savitramma) చేపట్టిన నిరాహార దీక్షను విజయవాడ (Vijayawada) పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా అమరణ దీక్షకు దిగిన సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో...బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. బలవంతంగా ఆసుపత్రికి తరలించే సమయంలో... పోలీసులకు దళిత సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం తోసుకున్నారు. తన కొడుకుకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని సావిత్రమ్మ చెబుతున్నారు. కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులకు దళిత సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
నా కొడుకును విడుదల చేయండి
కోడి కత్తి కేసులో రిమాండు ఖైదీగా శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేస్తున్నారు. తన తమ్ముడ్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో సీఎం అయ్యారని, దళితుడు అనే కారణంతో అందరూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడని...ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే శ్రీనుకు బెయిల్ రావడం లేదని నిందితుడి తరఫు న్యాయవాది సలీం అంటున్నారు.
ఐదేళ్లుగా జైల్లోనే కోడి కత్తి శీను
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ సీఎం జగన్ స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ నేటికి కూడా రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసులో లోతైన విచారణ జరపాలిని బాధితుడు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో జగన్ సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. శీను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లకు మోక్షం కలగడం లేదు. గతంలో శీను తల్లి సీజేఐకి.. రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది.
వీఐపీ లాంజ్లో జగన్ పై దాడి
2018లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దాంతో మధ్యాహ్నంలోపు పాదయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్...విఐపీ లాంజ్ లోకి వెళ్లారు. వీఐపీ లాంజ్లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో...అక్కడి క్యాంటీన్లో పని చేస్తున్న శ్రీను కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)