ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను అర్థరాత్రి విడుదల చేసింది.
AP Group 2 Results: ఏపీపీఎస్సీ పరీక్షలకు చదవడమంటే లైఫ్ను రిస్క్లో పెట్టడమేనా? గ్రూప్-2 ఫలితాలు ఆలస్యానికి కారణమేంటీ?
AP Group 2 Results: సుదీర్ఘ నిరీక్ష తర్వాత గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇలా ఒక నోటిఫికేషన్ కోసం ఇన్నేళ్లు సాగదీతపై అభ్యర్థు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP Group 2 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ -2 కొలువుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను అర్థరాత్రి విడుదల చేసింది.
905 ఉద్యోగులకు 891 మంది ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం గతంలో మొత్తం 905 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం వెలువడిన తుది జాబితాలో కమిషన్ 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన పోస్టులకు సంబంధించి కొన్ని సాంకేతిక, న్యాయపరమైన కారణాల వల్ల నియామకాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ ఎంపిక ప్రక్రియలో 866 పోస్టులకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మిగిలిన పోస్టుల విషయంలో న్యాయస్థానాల తీర్పులు, అభ్యర్థుల లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు.
న్యాయపరమైన చిక్కు ముడులు
ఈ నియామక ప్రక్రియ ఇంత కాలం జాప్యం కావడానికి ప్రధాన కారణం క్రీడా కోటా వ్యవహారంపై హైకోర్టులో సాగిన విచారణే. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టును రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అనుసరించి కమిషన్ ఆ రెండు పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయకుండా పక్కన పెట్టింది.
అంతేకాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చికాల మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఏసీ పోస్టులను కూడా కమిషన్ ప్రస్తుత జాబితా నుంచి పక్కన పెట్టింది. దీని వల్ల మొత్తం ప్రకటించిన 891 పోస్టుల్లో హైకోర్టు తుది తీర్పును అనుసరించి, హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మరో 25 పోస్టుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మొత్తం 905 పోస్టుల్లో ఇంకా ప్రకటించని 14 పోస్టుల పరిస్థితిని కమిషన్ వివరించింది. హైకోర్టు తీర్పుతో రిజర్వ్ చేసిన 2 క్రీడా కోటా పోస్టులు మినహాయించి, మిగిలిన 12 పోస్టులకు తగిన అభ్యర్థులు లభించలేదు.
వీటిలో 7 పోస్టులు దివ్యాంగుల కేటగిరికి చెందినవి. ఐదు పోస్టులు వివిధ రిజర్వేషన్ కేటగిరికి చెందినవి. ఆయా కేటగిరీల్లో అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయలేకపోయారు.
రెండేళ్ల సుదీర్ఘ ప్రక్రియ
ఈ గ్రూప్ 2 నియామక ప్రక్రియ దాదాపు రెండేళ్లపాటు కొసాగింది. అభ్యర్థుల సహనానికి ఇది పెద్ద పరీక్షగా మారింది. 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన జారీ చేసింది. లక్షలాది మంది 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష రాశారు. తర్వాత అక్కడికి ఏడాది తర్వాత అంటే 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025 ఏప్రిల్ 4న ఫలితాలు వెల్లడించారు. క్రీడా కోటా కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల చేయలేదు. ఇప్పుడు మరో ఏడాది తర్వాత దాన్ని విడుదల చేశారు.
అసలే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటి కోసం ఏళ్లతరబడి ప్రిపేర్ అవుతుంటారు. వేసిన నోటిఫికేషన్స్ కూడా అనుకున్న టైంలో పూర్తి చేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమంటే లైఫ్ను రిస్క్లో పెట్టడమే అంటున్నారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ, ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ నోటిఫికేషన్లు తగ్గిపోతున్నాయి. వయసు మీరిపోతున్న వాళ్లు ఉంటున్నారు. ఇల్లూ కుటుంబాన్ని వదిలి సంవత్సరాలు చదువుతున్నా పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో కోర్టు కేసులు కారణంగా ఫలితాల కోసం ఇలా నిరీక్షించాల్సి ఉంటోందని అంటున్నారు. ఇన్నేళ్లు ఎదురు చూసిన వాళ్లకు ఉద్యోగం తృటిలో తప్పిపోతే వారి బాధ వర్ణనాతీతం అంటున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన టైంలో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీని సక్రమంగా చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు.
Frequently Asked Questions
AP గ్రూప్-2 తుది ఎంపిక జాబితా ఎప్పుడు విడుదల అయింది?
ఎన్ని గ్రూప్-2 ఉద్యోగాలకు తుది జాబితాలో ఎంపిక జరిగింది?
మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుత జాబితాలో 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు.
కొన్ని గ్రూప్-2 పోస్టుల నియామకాలు ఎందుకు నిలిపివేశారు?
కొన్ని సాంకేతిక, న్యాయపరమైన కారణాల వల్ల, ముఖ్యంగా క్రీడా కోటా వ్యవహారంపై హైకోర్టు తీర్పు కారణంగా కొన్ని పోస్టులను ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
AP గ్రూప్-2 నియామక ప్రక్రియ ఎంత కాలం కొనసాగింది?
ఈ గ్రూప్-2 నియామక ప్రక్రియ దాదాపు రెండేళ్లపాటు కొనసాగింది. ప్రకటన 2023 డిసెంబర్ 7న విడుదలైంది.























