Telangana News : డాక్టర్లకు నేరుగా ఫోన్ చేయవచ్చు - ఇకపై సర్కారీ దవాఖానాల్లో బోర్డుమీద ఫోన్ నెంబర్లు
జూన్ ఆఖరుకు 500 బస్తీ దవాఖానలు!మే నెలాఖరుకు 3206 పల్లె దవాఖనలు !!
వరంగల్ హెల్త్ సిటి, టిమ్స్ ఆసుపత్రుల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇక నుంచి నెలవారీగా పురోగతిపై సమీక్ష చేస్తానని తెలిపారు. పది రోజుల్లో నిమ్స్ కొత్త నిర్మాణం టెండర్ పూర్తి చేయాలని కోరారు. బస్తీ దవాఖానలు పట్టణ ప్రజల సుస్తీ పోగెట్టెలా పని చేయాలని అన్నారు. నెలాఖరు వరకు పల్లె దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేయాలని చెప్పారు. పని వేళలు, వైద్యుడి ఫోన్ నెంబర్ బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. కంటి వెలుగు పరీక్షలు అందరికీ పూర్తిచేయాలని.. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ వేగవంతం చేయాలని కోరారు. సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో మంత్రి హరీష్ రావు పలు ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్ , ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్ కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి నెలవారీగా పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు నివేదికలతో సిద్దంగా ఉండాలన్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలి
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాలి
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలిసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే, కిడ్నీ బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 102 కు పెంచుకున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రారంభానికి సిద్దంగా ఉన్న డయాలిసిస్ కేంద్రాలు స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. మూడు క్లస్టర్స్ గా విభజించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు పరిశీలన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. బాధితులకు నిరంతర సేవలు అందేలా కృషి చేయాలని ఆదేశించారు.
జూన్ ఆఖరుకు 500 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్ పరిధిలో 350, హైద్రాబాద్ బయట పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయని, మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలి అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామని, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు సేవలు అందించాలని చెప్పారు.
డాక్టర్ నెంబర్ బోర్డుపై ప్రదర్శించాలి
ఈ నెలాఖరు వరకు 3206 పల్లె దవాఖనాలు పూర్తిస్థాయిలో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన 321 ఖాళీలు నింపాలని ఆదేశించారు. 9 నుండి 4 గంటల వరకు పని చేయాలని, పల్లె దవాఖాన టైమింగ్ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ ఫొనో నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా బోర్డుపై ఏర్పాటు చేయాలన్నారు. అందిస్తున్న సేవలు, చేస్తున్న పరీక్షలు, వెల్ నెస్ యాక్టివిటీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. జిల్లా వైద్యాధికారులు పనితీరుపై సమీక్షలు చేయాలని ఆదేశించారు.
కంటి వెలుగు పరీక్షలు అందరికీ చేయాలి
కంటివెలుగు కార్యక్రమం విజవంతంగా కొనసాగుతున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. 67 పనిదినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం సంతోషకరమన్నారు. 3006 వార్డుల్లో (87%) , 9556 పంచాయతీల్లో (74.72%) పూర్తి చేసినట్లు చెప్పారు. 27 శాతం మందికి అద్దాలు అవసరం కాగా, సగటున ఒక్కో బృందం రోజుకు 120 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. 19.64 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 15.30 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరం అని గుర్తించామన్నారు. 12 లక్షల మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets