Women's Day: విమెన్స్ డే స్పెషల్... మెగా మదర్ అంజనా దేవికి ఇష్టమైన సంతానం ఎవరో తెలుసా? చిరంజీవి ఏం చెప్పారంటే?
మహిళా దినోత్సవం సందర్భంగా తల్లి అంజనా దేవితో కలిసి మెగాస్టార్ చిరంజీవి తోబుట్టువులు స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రోమో ఈరోజు విడుదల చేశారు. పూర్తి ఇంటర్వ్యూ శనివారం విడుదల చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ దుర్గ, మాధవి... కొణిదెల వెంకట రావు, అంజన దేవి దంపతులకు ఐదుగురు సంతానం. మరి, ఈ ఐదుగురిలో అమ్మకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?
మహిళా దినోత్సవం స్పెషల్...
మహిళా దినోత్సవం సందర్భంగా తల్లి అంజనా దేవితో పాటు చిరు, ఇంకా ఆయన తోబుట్టువులు కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్చి 8, శనివారం అది విడుదల కానుంది. ఈ రోజు ప్రోమో విడుదల చేశారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
నాగబాబు అంటే తన తల్లికి చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. తమ తోబుట్టువులు అందరిలో కెల్లా తల్లికి క్లోజ్ అయినది తమ్ముడు నాగబాబు అని చిరు స్పష్టం చేశారు. నాగబాబు కంపెనీ అంటే తన తల్లికి చాలా ఇష్టమని, తాము ఉన్నప్పుడు అంతగా నవ్వదని, నాగబాబు ఉన్నప్పుడైతే నవ్వుతూ ఉంటుందని, నాగబాబును ముద్దు పెట్టుకోకుండా ఉండదని, ఇప్పటికీ నాగబాబు రాగానే దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దుపెడుతుందని మెగాస్టార్ తెలిపారు.
తల్లి నుంచి తనకు సలహా ఏమి రాలేదని, కానీ అమ్మ ఇచ్చే హగ్ ఎంతో విలువైనదని నాగబాబు అన్నారు. అందరం కలిసి ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్పకపోయినా ఆవిడ నుంచి తామందరం నేర్చుకున్నామని ఆయన వివరించారు. తన తల్లి పెద్దగా చదువుకోలేదని, కానీ ఇవాళ తామంతా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అమ్మేనని ఆయన తెలిపారు.
కష్టకాలంలో ధైర్యం చెప్పింది...
ఒకరి దగ్గర ఉండొద్దని సలహా!
అన్నయ్యలు చదువు కోసం వేరే ఊరు వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర తాను ఎక్కువ రోజులు ఉన్నానని, అన్ని పనులలో చేదోడు వాదోడుగా నిలిచానని సుప్రీం హీరో సాయి దుర్గా తేజ తల్లి విజయ దుర్గ తెలిపారు. అంజనా దేవి సైతం తనకు బ్యాంకు పనులతో పాటు అన్ని పనులలో విజయ దుర్గ సాయంగా ఉండేదని చెప్పారు.
తనకు కష్ట కాలం ఎదురైనప్పుడు అమ్మ ఎంతో ధైర్యం చెప్పిందని విజయ దుర్గ వివరించారు. సొంత కాళ్ళ మీద నిలబడాలి అని, ఒకరి ఇంటిలో ఉండవద్దని, ఆఖరికి తల్లిదండ్రుల ఇంట్లో కూడా వద్దని తన తల్లి చెప్పినట్లు విజయ దుర్గ తెలిపారు. అది తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఒకరి దగ్గర ఉంటే గౌరవం తగ్గుతుందని తల్లి చెప్పిన మాటలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని విజయ దుర్గ వివరించారు.
తాను ఒకసారి నిరాశలోకి వెళ్ళినప్పుడు, తనను తాను ఒంటరిగా భావించినప్పుడు నేనున్నానంటూ అమ్మ తనకు అండగా నిలబడిందని మాధవి భావోద్వేగానికి గురయ్యారు. ఎవరేమన్నా ఒంటరిగా ఫీల్ అవ్వద్దని, నేనున్నానని తల్లి ధైర్యం ఇచ్చినట్లు ఆవిడ తెలిపారు.
Also Read: ప్రతివోడూ సారీ సారీ అని దొబ్బేస్తున్నారేంటి? ఫుల్ యాక్షన్ మోడ్లో కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' ట్రైలర్





















