Jagadeka Veerudu Athiloka Sundari Re Release: రూ.6 టికెట్ బ్లాక్లో రూ.210 - అట్లుంటది మెగాస్టార్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' క్రేజ్..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ నెల 9 నాటికి 35 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా రీ రిలీజ్ కానుంది.

Megastar's Jagadeka Veerudu Athiloka Sundari Movie Re Release: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లోనే బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' (Jagadeka Veerudu Athiloka Sundari). దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో - ఫాంటసీ మూవీ విడుదలై ఈ నెల 9 నాటికి 35 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా మళ్లీ ఆ ఫాంటసీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కు అందించేందుకు మేకర్స్ ఈ నెల 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
రూ.6 టికెట్ రూ.210
మే 9, 1990న 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలై.. అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ ఈ మూవీ చెరిపేపింది. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ మూవీ రిలీజ్ అప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9 నుంచి 2D, 3D ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి.
జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి.అశ్వినీదత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించిన సంగతి తెలిసిందే.
మూవీకే సాంగ్స్ హైలెట్
ఈ మూవీలో పాటలన్నీ హైలెట్గా నిలిచాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్ప్లేను జంధ్యాల అందించారు.
'అబ్బ నీ తీయని దెబ్బ' అనే ఐకానిక్ సాంగ్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు గారు, దత్ గారు, నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సరళంగా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం రాశారు. బాలు గారు దానిని సరదాగా పాడారు' అని చెప్పారు.
‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.
106 డిగ్రీల జ్వరంతో మెగాస్టార్
'దినక్కుతా' అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైంకి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో, మేము ఆయన శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్తోంది. కాబట్టి మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవి గారిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.





















