Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఓటర్ల లెక్కలపై క్లారిటీ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్.

Jubilee Hills By-Elections : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపైన ప్రధాన పార్టీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. గెలిచేది ఒక్క నియోజవర్గమైనప్పటికీ ఆ లెక్కలు అధికారపార్టీ పనితీరుకు కొలమానంగా మారబోతున్నాయనే వాదనల నేపధ్యంలో అటు అధికార పార్టీతోపాటు ఇటు సిట్టింగ్ సీటు కోసం ప్రతిపక్ష బిఆర్ఎస్, మేము కూడా తగ్గేదే లేదంటూ బిజేపిలు ఇలా త్రిముక పోరుతో జూబ్లీహిల్స్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. త్వరలో నోటిఫికేషన్ విడుదలకానున్న వేళ ఓటర్ల లెక్కలపై తాజాగా క్లారిటీ ఇచ్చేసింది ఎలక్షన్ కమిషన్. ఓటర్లు లెక్కలను బట్టే అభ్యర్దుల తలరాతలు మారిపోతాయి. ఇన్నాళ్లు ఊహజనిత కథనాలు, కాకిలెక్కలు ఇక చాలంటూ తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫైనల్ లెక్కలు విడుదల చేశారు ఎలక్షన్ కమిషన్ సీఈవో సుధర్శన్ రెడ్డి.
అతి త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉండగా, ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లుపైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు ఉన్నారు. అంతేకాదు 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు అండగా , విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు.
ఇటీవల సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చారు, 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000 గా తేలింది. ఓటర్ల సంఖ్య ఆధారంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.





















