AP Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే
Andhra Pradesh Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Background
Andhra Pradesh Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీ లోక్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దాదాపు 4 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. వీటి లెక్కింపునకు ప్రత్యేక కౌంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీవ్యాప్తంగా మొత్తం 454 ఎంపీ అభ్యర్థులు బరిలో నిలవగా.. అత్యధికంగా విశాఖ పార్లమెంట్ బరిలో 33 మంది అభ్యర్థులు.. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. ఈ ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు, రాజమహేంద్రవరం, నర్సాపురం లోక్ సభకు సంబంధించి 13 రౌండ్లు లెక్కింపు జరగనుండగా.. ఫలితం వచ్చేసరికి 5 గంటల సమయం పడుతుంది.
పటిష్ట భద్రత
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, మాచర్ల, తిరుపతి నియోజకవర్గాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఉంటుందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మొత్తం 119 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన ఫోన్ల వరకూ తీసుకెళ్లవచ్చని సూచించారు.
నరాలు తెగే ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 26,473 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కాగా ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అధికార వైసీపీ సహా, టీడీపీ కూటమి నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికార వైసీపీ 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు, టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి నేతలు సైతం అధిక ఎంపీ స్థానాలు తామే కైవసం చేసుకుంటామని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కడప ఎంపీ స్థానంపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బరిలో నిలిచారు. వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం నెల్లూరు స్థానం నుంచి గెలుపుపై ధీమాగా ఉన్నారు.
ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే
AP Loksabha Election Results 2024: టీడీపీ ఎంపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని 1.58 లక్షల ఓట్లు, అమలాపురం - హరీష్ (1.54 లక్షల ఓట్లు), విశాఖ -శ్రీభరత్ (1.69 లక్షల ఓట్లు), శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు (1.70 లక్షలు), ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి (8,223 ఓట్ల ఆధిక్యం), హిందూపురం - పార్థసారథి (50 వేల ఓట్లు), అనంతపురం - లక్ష్మీనారాయణ (88 వేల ఓట్ల ఆధిక్యం), ఏలూరు - మహేష్ కుమార్ (86 వేల ఓట్లు), విజయనగరం - అప్పలనాయుడు (81 వేల ఓట్లు), నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు (80 వేల ఓట్లు), చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ (81 వేల ఓట్లు), నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (లక్ష ఓట్లు) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల లీడ్ లో పెమ్మసాని
AP Loksabha Election Results 2024: గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకూ 3,44,736 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈయన.. ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్నారు.





















