JEE Main: జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలకు సర్వం సిద్ధం, అభ్యర్థులకు ముఖ్య సూచనలివే
JEE Main - 2025: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షకు 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి.

JEE MAINS 2025: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రోజుకు రెండు షిఫ్ట్లలో ఆన్లైన్ విధానంలో పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి. బీటెక్లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్-2ను ఏప్రిల్ 9న మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. సెకండ్ షిఫ్ట్ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది.
జేఈఈ మెయిన్-2025 తొలి విడత పేపర్-1 పరీక్షలకు మొత్తం 13.11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 12.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది ఉంటారని అంచనా. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరు మాత్రమే 100 పర్సంటైల్ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో విడత పరీక్షల తర్వాత ర్యాంకులను ప్రకటించనున్నారు.
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు ముగిసిన తర్వాత ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని (రెండు విడతలు రాస్తే) ఎన్టీఏ ఏప్రిల్ 17న లేదా అంతకు ముందే జాతీయ ర్యాంకులను ప్రకటించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయిస్తారు. ఆ ప్రకారం మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు ఆ ర్యాంకులతో దేశంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఒకవేళ ఐఐటీల్లో చేరాలనుకుంటే మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం..
➥పేపర్-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్-ఎ 20 మార్కులు, సెక్షన్-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష
నిట్లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్స్టిట్యూట్లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏపీలో అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మంగళగిరి, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
⫸ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురికాకుంగా ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయకూడదు. తెలియని ప్రశ్నను పట్టుకుని, సమయం వృథా చేసుకోవద్దు.
⫸ జేఈఈ మెయిన్స్లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిది. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదు.
⫸ పట్టున్న అంశాలపైనే దృష్టిపెట్టడం మంచిది. లేకపోతే సమయమంతా వృథా అవుతుంది. పరీక్షకు సమయం లేనందున రివిజన్ మాత్రమే చేస్తే బెటర్.
⫸ ప్రతి సబ్జెక్టులో రెండో సెక్షన్లో ఇచ్చే న్యుమరికల్ ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. మొదటి సెక్షన్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు చాయిస్ లేదు. పరీక్షలో 40 శాతం ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్, మరో 40 శాతం పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు.
⫸ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టేట్మెంట్స్, అసెర్షన్, రీజన్స్ తరహా ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నారు. ఈ తప్పు జరగకుండా ఫార్ములాలను గుర్తుంచుకోవటం మంచిది.
⫸ విద్యార్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
⫸ అడ్మిట్ కార్డుతోపాటు అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది.
⫸ వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తారు.
⫸ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్ఫోన్లు, బ్లూటూట్ ఉపకరణాల వంటి వాటికి అనుమతి లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

