Union Budget 2026: యాక్సిడెంట్ క్లెయిమ్ వడ్డీపై ట్యాక్స్ లేదు, TDS కూడా పూర్తిగా తొలగింపు
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లపై Union Budget 2026లో కీలక నిర్ణయం వెలువడింది. ట్రిబ్యునల్ వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపు, TDS పూర్తిగా రద్దు చేశారు.

Motor Accident Claim Tax Exemption - Budget 2026-27: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, కుటుంబాన్ని కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Union Budget 2026-27లో భాగంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లపై ఉన్న పన్ను (Income Tax) భారం పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది ప్రమాద బాధితులకు పెద్ద ఊరట కలిగించే అంశంగా మారింది.
ఇక నుంచి, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) బాధితులకు ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీ మొత్తంపై ఆదాయ పన్ను ఉండదు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది పూర్తిగా పన్ను మినహాయింపుగా అమలు చేస్తారు. ఇప్పటి వరకు, ఈ వడ్డీపై ఆదాయ పన్ను వర్తిస్తుందా లేదా అనే అంశంపై పెద్ద గందరగోళం కొనసాగింది. అనేక కేసులు కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి.
TDS కూడా పూర్తిగా తొలగింపు
ఇంతకు ముందు, ప్రమాద పరిహారం రూపంలో బాధితులకు వచ్చే వడ్డీపై TDS కట్ చేసేవారు. దీని వల్ల అసలు బాధితులకు అందాల్సిన మొత్తం తగ్గిపోయేది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించని పేద కుటుంబాలకు ఇది పెద్ద సమస్యగా మారింది. కట్ అయిన TDSను తిరిగి రిఫండ్గా పొందాలంటే మరోసారి పన్ను ప్రక్రియలోకి వెళ్లాల్సి వచ్చేది. చాలా సందర్భాల్లో ఆ డబ్బు క్లెయిమ్ చేయకుండానే మిగిలిపోయేది.
సుప్రీంకోర్టు నుంచి కూడా సూచన
ఈ సమస్యపై సుప్రీంకోర్టు కూడా గతంలో తీవ్రంగా స్పందించింది. 2022లో ప్రమాద పరిహారాలపై TDS కట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. ప్రమాద బాధితులకు ఇచ్చే పరిహారం సంక్షేమ పరమైనదని, దానిపై పన్ను విధించడం అన్యాయమని అభిప్రాయపడింది. ఆ తర్వాత 2024లో కూడా రూ. 50,000కు మించిన వడ్డీపై TDS వర్తించాలా వద్దా అనే అంశంపై కేంద్రం, ఆదాయ పన్ను విభాగం నుంచి వివరాలు కోరింది. ఈ అంశం ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది.
ఈ నేపథ్యంలో Union Budget 2026లో తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. ఇక నుంచి MACT వడ్డీపై TDS ఉండదు. బాధితులకు మంజూరైన మొత్తం పూర్తిగా వారి చేతికి చేరుతుంది. మధ్యలో పన్ను కట్లు, రిఫండ్ ప్రక్రియలు ఉండవు. ఇది పరిహారం పంపిణీని మరింత సులభతరం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతి ఏడాది వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి క్లెయిమ్ రూపంలో వచ్చే డబ్బు కాస్తయినా ఊరటగా ఉంటుంది. అలాంటి వారికి ఈ నిర్ణయం ఆర్థికంగా పెద్ద భరోసా ఇస్తుంది.
సామాజిక న్యాయం, సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రమాద బాధితుల బాధను అర్థం చేసుకుని, వారికి పూర్తి పరిహారం అందాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ మినహాయింపు అమలు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. Union Budget 2026లో ప్రకటించిన ఈ మార్పు, రోడ్డు ప్రమాద బాధితుల జీవితాల్లో నిజంగా మార్పు తీసుకొచ్చే నిర్ణయంగా నిలవనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.



















