![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు.
![AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన AP Revenue Services Association 17th State Council Meeting Held In Vijayawada AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/66fe8490ef5ddf767f348fc389ed60751696170385948798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ 17వ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం ఆదివారం విజయవాడలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన హాజరయ్యారు. రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, సహా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ నేతలు మంత్రి ధర్మానకు వివరించారు. వీఆర్ఏలకు వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని వెల్లడించారు. హెచ్ఆర్ఏ లేకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు మంత్రికి వివరించారు. వీఆర్ఏలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1500 మంది వీఆర్ఏలు పరీక్ష పాస్ కాలేదని, ప్రొబేషన్ ఇవ్వడం లేదని, పరీక్షతో సంబంధం లేకుండా అందరికీ వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు.
రెవెన్యూ ఉద్యోగులు 24 గంటల పాటు ఎంత కష్టాన్నైనా పడతామని అన్నారు. టెలి కాన్ఫరెన్స్లతో రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్లను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 20ని రెవెన్యూ డేగా అమలు చేయాలని, రెవెన్యూ ఉద్యోగులందరి సర్వీసు రూల్స్ ఏకీకృతం చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం జిల్లాల్లో ముగ్గురు జేసీలుగా పెంచి మళ్లీ తగ్గించిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జేసీలను ఎందుకు పెంచారో ...ఎందుకు తగ్గించారో తమకు తెలియడం లేదన్నారు. గతంలో ఇచ్చినట్లుగా ముగ్గురు జేసీలను ఇస్తే బాగుంటుందన్నారు.
ఆత్మాభిమానం చనిపోతే విపత్కర పరిస్థితులు వస్తాయని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ చంద్రారెడ్డి అన్నారు. జిల్లాల్లో నలుగురు జేసీలు చేసే పని ఒక్కరే చేస్తున్నారని, వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటోందన్నారు. జిల్లాల్లో అదనపు జాయింట్ కలెక్టర్లను పునరుద్దరించాలని కోరారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు అదనపు జేసీలను ఇవ్వాలని, డిప్యూటీ కలెక్టర్లకూ వాహనాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మరో నేత రమేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రొటో కాల్ బడ్జెట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో తెలియడం లేదని తెలిపారు. సీఎం కార్యక్రమాలకు సైతం ఇలాగే ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇళ్ల స్థలలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలను విన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తమకు తెలుసన్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలు చేసేందుకు సీఎం చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. చుక్కల భూములు, షరతుల భూముల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ఉద్యోగులంతా సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలని మంత్రి కోరారు.
తమ దృష్టికి తెచ్చిన సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎప్పటుకప్పడు అప్ డేట్ కాకపోతే అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులు ప్రభుత్వ ఆంకాక్షలను నెరవేర్చేలా పని చేయాలని సూచించారు. అనంతరం రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చట్టానికి అనుగుణంగా పనిచేయాలని, ఏ మాత్రం అతిక్రమించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)